నటి శ్రీవాణి కోసం పోలీసుల వెయిటింగ్: అరెస్ట్ ఛాన్స్, డుమ్మా ఎందుకు?
హైదరాబాద్: బుల్లి తెర నటి శ్రీవాణి శుక్రవారం నాడు వికారాబాద్ పోలీస్ స్టేషన్లో హాజరు కావాల్సి ఉంది. కానీ ఆమె డుమ్మా కొట్టారు. తనకు షూటింగ్ ఉందని చెప్పి ఆమె రెండు మూడు రోజులుగా రావడం లేదని తెలుస్తోంది. అయితే, శ్రీవాణి, ఆమె భర్త విక్రమాదిత్య పైన వదిన అనూష కేసు పెట్టిన విషయం తెలిసిందే.
విచారణ నిమిత్తం పోలీసులు శ్రీవాణిని, అనూషను పోలీస్ స్టేషన్ రావాలని చెప్పారు. ఈ నేపథ్యంలో శుక్రవారం శ్రీవాణి పోలీస్ స్టేషన్ వస్తారని భావించారు. వదిన అనూష పోలీస్ స్టేషన్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. పోలీసులు ఆస్తి తగాదా విషయమై ఇరువురిని ప్రశ్నించాలని భావించారు. తనకు షూటింగ్ ఉందని చెప్పిన శ్రీవాణి, తన భర్తతో మాట్లాడాలని సూచించారని తెలుస్తోంది.
శ్రీవాణి సహకరించడం లేదు: పోలీసులు
శ్రీవాణి విచారణకు సహకరించడం లేదని పోలీసులు తెలిపారు. ఆమెను విచారణకు పిలిపించామని, రాకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. ఆమెకు ఫోన్ చేశామని, అయినప్పటికీ రాలేదని చెప్పారు. వదినపై శ్రీవాణి దాడి చేసినట్లుగా తేలిందని సీఐ తెలిపారు. ఇవాళ, రేపటిలోగా పోలీస్ స్టేషన్లో హాజరు కావాలన్నారు.
రూ.5 కోట్ల ఆస్తి.. రాసిస్తా: బుల్లితెర నటి శ్రీవాణి ట్విస్ట్, తండ్రి మెలిక
శ్రీవాణి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అనూష పోలీస్ స్టేషన్కు వస్తే కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. శ్రీవాణి విచారణకు వస్తే నిర్దోషిగా నిరూపించుకోవచ్చన్నారు. కాగా శ్రీవాణిని అరెస్ట్ చేసే అవకాశముందంటున్నారు.
తాను రావాల్సిందే: అనూష
శ్రీవాణి పోలీస్ స్టేషన్కు రావాల్సిందేనని, అప్పటి దాకా తాను సహకరించనని వదిన అనూష శుక్రవారం మధ్యాహ్నం తెలిపారు. ఆమె వస్తే తాను పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. అనూష ఉదయమే స్టేషన్కు వచ్చారు.
ఇదిలా ఉండగా, శ్రీవాణి రాక కోసం పోలీసులు ఉదయం నుంచి వేచి చూశారు. ఆమె రాలేదు. శ్రీవాణి ఎలాంటి తప్పు చేయకుంటే పోలీస్ స్టేషన్కు వచ్చేందుకు ఎందుకు భయపడుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. శ్రీవాణి వికారాబాదులో ఉన్నారా లేక బయట ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పరిగిలో ఉన్న కేసును వికారాబాద్ తెచ్చారు.
మీడియా సాక్షిగా అబద్దాలు
మీడియా సాక్షిగా తమ కుటుంబం మొత్తం తన వెంటే ఉందని శ్రీవాణి చెబుతోందని, అలాంటప్పుడు తమ ఊరి వాళ్లు చెబుతున్నది అబద్ధాలని ఎలా అంటారని శ్రీవాణి వదిన అనూష నిన్న (గురువారం) ప్రశ్నించారు. తన భర్త ఐసీయూలో ఉన్నప్పుడు అతనిని చూసేందుకు ఏనాడూ శ్రీవాణి రాలేదన్నారు.
తన భర్త (శ్రీవాణి అన్న) మరణించినప్పుడు చూసేందుకు వచ్చిన శ్రీవాణి శవం దగ్గర గంటసేపు ఉండి వెళ్లిపోయిందని ఆరోపించారు. భర్తకు చెప్పకుండా తన ఇంటికి వచ్చిన శ్రీవాణిని తాను ఎలా ఆదరించానో ఆమెకే తెలుసన్నారు. తాను భర్తతో కలిసి శ్రీవాణి ఇంటికి వెళ్తే మాటలతో వేధించి వెళ్లగొట్టారన్నారు.