అమెరికాలో చదివిన కేటీఆర్కు తెలియదా?: సుహాసిని ఇష్యుపై కౌంటర్, పెరుగుతున్న మద్దతు
హైదరాబాద్: మహాకూటమి పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున నందమూరి సుహాసిని కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గురువారం సీపీఐ నారాయణ కూకట్పల్లి టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన నిప్పులు చెరిగారు.
నందమూరి సుహాసినికి వైసీపీ భారీ దెబ్బ?: ఓడితే ఏపీ సీఎంగా.. ఇదీ జగన్ లెక్క!
కేసీఆర్ అర్ధాంతరంగా ప్రభుత్వాన్ని ఎందుకు రద్దు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఫాంహౌస్ నుంచి పాలన కొనసాగించారని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిందన్నారు. బీజేపీ, తెరాస, మజ్లిస్ పార్టీల కలయిక అపవిత్రమని చెప్పారు. ఈ సందర్భంగా సుహాసిని పోటీ చేయడాన్ని మంత్రి కేటీఆర్ ప్రశ్నించడంపై నారాయణ స్పందించారు.
కేటీఆర్కు అది తెలియదా.. సుహాసిని పోటీపై నారాయణ
తెలంగాణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కూకట్పల్లి నుంచి నందమూరి సుహాసిని పోటీ చేస్తే తప్పేమిటని నారాయణ ప్రశ్నించారు. దేశంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చునని చెప్పారు. అమెరికాలో చదివిన మంత్రి కేటీ రామారావుకు భారతదేశంలో పోటీ చేసే అర్హతల గురించి తెలియదా అని ప్రశ్నించారు.
సుహాసనికి ఓయు జేఏసీ మద్దతు
నందమూరి సుహాసినికి పలువురు మద్దతు లభిస్తోంది. ఇటీవల తెరాస నుంచి గొట్టిముక్కల పద్మారావు టీడీపీలో చేరారు. సుహాసినికి అండగా నిలబడతానని చెప్పారు. ఓయు జేఏసీ కూడా ఆమెకు మద్దతుగా నిలబడతామని చెబుతోంది. ఓయు, హైదరాబాద్ సెంట్రల్ తదితర యూనివర్సిటీల విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అలా ఉద్యమంలో పాల్గొన్న కొంతమంది సుహాసినికి మద్దతు పలికారు. పలువురు ఓయు జేఏసీ నాయకులు ఆమెకు మద్దతుగా ఇంటింటికి కరపత్రాలు పంచుతున్నారు.
సుహాసినికి అందరి అండ
సుహాసినికి మద్దతుగా ఏపీ మంత్రి పరిటాల సునీత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, నందమూరి కుటుంబం నుంచి తారకతర్న, జానకీరామ్ సతీమణి, అలాగే కళ్యాణ్ రామ్ సతీమణి కూడా ప్రచారంలో పాల్గొన్నారు. సుహాసినికి అంతకంతకు మద్దతు పెరుగుతోంది. 2009 తర్వాత నందమూరి కుటుంబం టీడీపీకి ప్రచారం చేయడం మళ్లీ ఇదే కావడం గమనార్హం.
గెలిపించాలని సుహాసిని విజ్ఞప్తి
ఇదిలా ఉండగా, కూకట్పల్లిలో తనను గెలిపించాలని నందమూరి సుహాసిని ప్రచారం చేస్తున్నారు. నందమూరి కుటుంబం నుంచి ప్రజలకు సేవ చేసేందుకు తనకు అవకాశమివ్వాలని కోరారు. తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. కూకట్పల్లికి ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని తాను అమలు చేస్తానని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి నిత్యం అందుబాటులో ఉంటానని చెప్పారు. తన తాత ఎన్టీఆర్, తన తండ్రి హరికృష్ణ, తన మామయ్య చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ, ప్రజా సేవకు అంకితం అవుతానని చెప్పారు.