మావోయిస్టు కీలక నేత ప్రభాకర్ నగరవాసే: తల్లడిల్లిన యాప్రాల్
హైదరాబాద్: రెండ్రోజుల క్రితం ఏవోబీలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 24మంది మావోయిస్టులతోపాటు పలువురు కీలక నేతలు కూడా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు కార్యకలాపాల్లో చురుకుగా వ్యవహరిస్తూ కీలక నేతగా ఎదిగిన నగరవాసి ప్రభాకర్ అలియాస్ హరి అలియాస్ గంగాధర్ కూడా మృతి చెందారు. ప్రభాకర్ హైదరాబాద్లోని యాప్రాల్లో నివాసముండేవారు.
కాగా, ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల చిత్రాలు మీడియాల్లో ప్రచురితం కాగా, ప్రభాకర్ను ఆయన కుటుంబసభ్యులు గుర్తించారు. ఈ క్రమంలో ఆయన ప్రభాకర్ భార్య దేవేంద్రి హుటాహుటిన మల్కాన్గిరికి తరలివెళ్లింది. దళిత కుటుంబంలో జన్మించిన ప్రభాకర్ భవన నిర్మాణ కార్మికుడైన అంజయ్య, రత్నమ్మ దంపతుల రెండో సంతానం.
1997లో ప్రజాకళా మండలిలో చేరిన ప్రభాకర్... 2006లో దేంవేంద్రిని వివాహం చేసుకున్నాడు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడంతోపాటు 'తెలంగాణ గోస' అనే లఘు చిత్రాన్ని కూడా ఆయన రూపొందించాడు. 2014లో ఆదివాసీలను చైతన్యపరిచే ఉద్దేశంతో ఏవోబీలో ప్రజాచైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ అజ్ఞాతంలోకి వెళ్లాడు.
అప్పట్నుంచి మావోయిస్టు సాంస్కృతిక సభ్యుడిగా పనిచేస్తూ జిల్లా కమిటీ నేతగా ఎదిగాడు. ప్రభాకర్ మృతితో యాప్రాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పేదల హక్కుల కోసం పోరాడుతూ తన కొడుకు ప్రాణాలు కోల్పోయాడని తల్లి రత్నమ్మ కన్నీరుమున్నీరుగా విలపించింది. ఎన్ కౌంటర్ ఘటనా స్థలం నుంచి ప్రభాకర్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.