జాగ్రత్త: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..మూడు రోజులు దంచి కొట్టనున్న వర్షం
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 9వ తేదీన వర్షాలు ప్రారంభం అవుతాయని పేర్కొంది. జూన్ 10వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు భారీగా కురుస్తాయని వివరించింది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు దక్షిణ కర్నాటక, రాయలసీమ, తమిళనాడులోని మెజార్టీ జిల్లాలను తాకాయని పేర్కొంది. బంగాళా ఖాతం తీరం వెంబడి రుతుపవనాలు విస్తరించి ఉన్నాయని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక ఇక్కడ నుంచి నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర కర్నాటకలోని ఇతర ప్రాంతాలకు అక్కడి నుంచి తెలంగాణకు విస్తరిస్తాయని వెల్లడించింది.
తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అక్కడ అల్పపీడనం ఏర్పడి రానున్న 2 రోజుల్లో అది తుఫానుగా మారుతుందని స్పష్టం చేసింది. ఈ తుఫాను క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రానున్న 24 గంటల్లో మరింత తీవ్రగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోంది. ప్రస్తుత పరిస్థితులు తెలంగాణ కోస్తాంధ్రకు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 10 మరియు జూన్ 11వ తేదీల్లో తెలంగాణలో ఓ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని భారత వాతావరణశాఖ పేర్కొంది. ఉత్తర కోస్తా ప్రాంతాలతో పాటు యానాంలో కూడా ఈ వర్షాలు అధికంగా కురుస్తాయని వెల్లడించింది. జూన్ 9న ఈ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా ప్రాంతం, రాయలసీమల్లో జూన్ 11న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. జూన్ 8 మరియు జూన్ 9న తెలంగాణలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్న భారత వాతావరణ శాఖ ... జూన్ 10 మరియు 11వ తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.