వాళ్లకు వందల ఏళ్లు, నాకు 9 ఏళ్లే: గ్రేటర్ ప్రచారంలో హైదరాబాద్పై చంద్రబాబు
హైదరాబాద్: హైదరాబాద్ను అభివృద్ధి చేసేందుకు నిజాం పాలకులకు 400 ఏళ్లు పట్టిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన మెదక్ జిల్లాలోని పటాన్చెరు నుంచి చంద్రబాబు ప్రచారాన్ని ప్రారంభించారు.
తెలుగు జాతి ఆత్మగౌరవం, అభివృద్ధి కోసమే ఎన్టీఆర్ పార్టీ పెట్టారన్నారు. అధికారం, డబ్బు కోసం ఎన్టీఆర్ పార్టీ పెట్టలేదని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన తర్వాత జరుగుతున్న రెండో ఎన్నికలు జీహెచ్ఎంసీ ఎన్నికలని చెప్పారు. దేశంలో పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన ఘనత ఎన్టీఆర్దేనని ఆయన కొనియాడారు.
పేదవాళ్లకు పక్కా ఇళ్లను కట్టించిన ఘనత ఎన్టీఆర్దేనని, తెలంగాణ ప్రజలకు ఎనలేని సేవలందించారని ఆయన కొనియాడారు. హైదరాబాద్ను అభివృద్ధి చేసేందుకు నిజాం పాలకులకు 400 ఏళ్లు పట్టిందన్నారు. 9 ఏళ్ల తన పాలనలో హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలిపానన్నారు.
ఇక సికింద్రాబాద్ను అభివృద్ధి చేసేందుకు ఆంగ్లేయులకు వందల ఏళ్లు పట్టిందన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే మూడేళ్లలో మెట్రో రైలు ప్రాజెక్టును పూర్తి చేసే వాళ్లమన్నారు. మరి ఎందుకు ఆలస్యం అవుతుందని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్లో ఐటీకి ప్రాధాన్యత ఇచ్చానని, దీనివల్ల 14 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు.
తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం ఎన్టీఆర్ తెచ్చారని, ఇప్పుడున్న నాయకులు ఎక్కడి నుంచి వచ్చారని, నన్ను విమర్శించే హక్కు వీరికి ఎక్కడిదని చంద్రబాబు ప్రశ్నించారు. అలాగే హైదరాబాద్లో అడుగడుగునా నేను చేసిన అభివృద్ధి ఉందని, నేను ఎక్కడికీ వెళ్లలేదు.. ఇక్కడే ఉంటా.. మీతోనే ఉంటానన్నారు.
తెలంగాణ సమస్యలపై కేంద్రంతో మాట్లాడుతూనే ఉన్నానని, తెలంగాణ రైతుల కోసం బాబ్లీపై పోరాడానని, నేను రాజీ పడ్డానని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారని, ఇందిరా, రాజీవ్గాంధీ, సోనియాకే భయపడలేదని, నేను ఎవరికీ భయపడనన్నారు. అలాగే రాజకీయం వేరు, ప్రభుత్వాలు వేరని అన్నారు.
టీడీపీ ప్రజల పక్షానే ఉంటుందే తప్ప వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని, 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించడం సరికాదన్నారు. కేంద్రం సహకారం కావాలంటే టీడీపీ-బీజేపీ కూటమిని గెలిపించాలన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా పటాన్చెరులో ప్రారంభమైన చంద్రబాబు ప్రచారం ఆ తర్వాత రామచంద్రాపురం, చందానగర్, మదీనగూడ, మియాపూర్, నిజాంపేట, కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు ముగుస్తుంది.
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారానికి సంబంధించి టీడీపీ శ్రేణులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాయి. అంతకుముందు పార్టీకి చెందిన ఏపీ, తెలంగాణ నేతలతో చంద్రబాబు సమావేశమై ఈ ఎన్నికలలో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
ఆ ఎమ్మెల్యే ఎక్కడున్నాడు..
కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి టిడిపి తరఫున గెలిచిన వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నాడని అడుగుతూ స్వార్థం కోసం పార్టీ మారాడని చంద్రబాబు విమర్శించారు. కూకట్పల్లిలో ఆయన టిడిపి, బిజెపికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. పార్టీ ఫిరాయింపుదారులకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని అన్నారు.
హైదరాబాదును తానే ప్రపంచ పటం మీద నిలబెట్టానని చెప్పారు. తెలుగువారు ఎక్కడుంటే టిడిపి అక్కడ ఉంటుందని ఆయన చెప్పారు. హైదరాబాదు, సికింద్రాబాదులను అభివృద్ధి చేస్తూ సైబరాబాద్ను నిర్మించి ఆర్థిక నగరంగా అభివృద్ధి చేసింది తానే అని ఆయన చెప్పారు.