ఫోన్ చేసి జయ గురించి అడిగిన బాబు: శ్రీవారికి పూజ, ప్రసాదం పంపించారు
చిత్తూరు: చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు రాత్రి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని పంపించారు.
అస్వస్థతతో ఆసుపత్రి పాలైన జయలలిత కోలుకోవాలని కోరుకుంటూ తిరుమలలో చంద్రబాబు ప్రత్యేక పూజలు చేయించారు. ఆమె కోసం స్వామి వారి ప్రసాదాన్ని, అంగ వస్త్రాన్ని పంపించారు. టిటిడి పాలక మండలి సభ్యులు శేఖర్ ఈ ప్రసాదం తీసుకు వెళ్లారు. అంతేకాకుండా, జయ ఆరోగ్యం పైన ఫోన్ చేసి చంద్రబాబు వాకబు చేశారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కాగా, జయలలితకు విధేయుడు, అన్నాడీఎంకేలో కీలకనేత పన్నీర్సెల్వం గతంలో రెండుసార్లు సీఎంగా పదవీబాధ్యతలు చేపట్టారు. తాజాగా, ఆయన అమ్మ బాధ్యతలు మోస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థికమంత్రిగా పదవీబాధ్యలు నిర్వహిస్తున్నారు. తాజాగా సీఎం జయలలిత నిర్వహిస్తున్న ఎనిమిది మంత్రిత్వశాఖలను ఆయనకు బదలాయిస్తూ రాజ్భవన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో ఆయన తన మంత్రిత్వశాఖలతో పాటు జయలలిత మంత్రిత్వశాఖలను పర్యవేక్షించాల్సి ఉంది. గతంలో సీఎంగా పని చేసిన సమయంలో జయలలిత నుంచి పలు సూచనలు పన్నీరు సెల్వంకు అందేవి.
ఇప్పుడు ఆమె ఆసుపత్రిలో ఉండటంతో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం కత్తిమీద సాములాంటిది. జయ స్నేహితురాలు శశికళ, సీఎం సలహాదారు షీలా బాలకృష్ణన్ల సూచనల మేరకు పాలనా బాధ్యతలను నిర్వహించాల్సి ఉంది. దీంతో పన్నీర్ సెల్వం రాజకీయ జీవితంలోనే ఇప్పుడో పెద్ద సవాల్ ఎదురుకానుందంటున్నారు.