వైఎస్ జగన్ సన్నిహితులే.. కానీ: ఆ విషయంలో రాజీలేదంటూ మంత్రి కేటీఆర్
హైదరాబాద్: కరోనాతోపాటు వివధ అంశాలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. యువతకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శమని అన్నారు. వైద్య రంగంలో మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు చెప్పుకోదగిన స్థాయిలోనే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలుంటాయి..
ఆదివారం ట్విట్టర్ వేదికగా ‘ఆస్క్ కేటీఆర్' పేరుతో నెటిజన్ల నుంచి మంత్రి కేటీఆర్ పలు ప్రశ్నలను స్వీకరించి, సమాధానాలు చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రులపై వస్తున్న ఫిర్యాదులపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇప్పటికే కరోనా చికిత్సకు సంబంధించి రెండు ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. అధిక ఫీజులు వసూలు చేస్తే మరిన్ని ఆస్పత్రులపైనా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని వసతులూ ఉన్నాయని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరాలన్నారు.
ఇతర రాష్ట్రాలతో పోల్చొద్దు..
ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 23వేల కరోనా పరీక్షలు చేస్తున్నామని, ఆ సంఖ్యను త్వరలో 40వేలకు పెంచుతామని కేటీఆర్ తెలిపారు. కరోనా పరీక్షల విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిక లేదని స్పష్టం చేశారు. ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ మెరుగైన పథకమని చెప్పుకొచ్చారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వం కొత్తగా 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిందని తెలిపారు. అన్ని ఏరియా ఐసీయూ యూనిట్స్ మొదలుపెట్టామని, ఉచితంగా డయాలసిస్ కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజా రవాణాను తిరిగి ప్రారంభించే విషయంలో కేంద్రం అనుమతి కోసం వేచి చూస్తున్నామని చెప్పారు.
హైదరాబాద్ ఒకటి..
స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారు. టీఎస్ బీపాస్ పట్టణ సంస్కరణల్లో బెంచ్ మార్క్గా నిలుస్తుందని తెలిపారు. ఎక్కువ సీసీటీవీ కెమెరాలు ఉన్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి కావడం గర్వకారణమని చెప్పుకొచ్చారు. ఆగస్టు మూడో వారంలో దుర్గం చెరువు తీగల వంతెన ప్రారంభిస్తామని కేటీఆర్ తెలిపారు. ఏడాదిలో టీఫైబర్ పనులు పూర్తవుతాయన్నారు.
జగన్ సన్నిహితులే కానీ.. రాజీపడే ప్రసక్తే లేదు..
ఈ సందర్భంగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తమకు మంచి సంబంధాలున్నాయని తెలిపారు. అయితే, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కుల కోసం పూర్తి స్థాయిలో పోరాడతామని మంత్రి తెలిపారు. ఇప్పటికరే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు.