కేటీఆర్ ఆఫర్ రూ.3 కోట్లు!: ఏపీ కౌంటర్ వీడియో
ఖమ్మం: రేవంత్ రెడ్డి వ్యవహారం, చంద్రబాబు ఆడియో టేపులు తీవ్ర కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెరాసకు కౌంటర్గా ఓ వాదన తెర పైకి వచ్చింది. ఏపీ కౌంటర్ టేపులు విడుదల చేసింది. ఆ టేపుల ప్రకారం అంటూ ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చింది.
పత్రికలో వచ్చిన దాని ప్రకారం... విడుదలైన టేపుల ప్రకారం ఖమ్మం జిల్లా వైరా నుంచి వైసీపీ తరఫున గెలిచి, ఆ తర్వాత తెరాసలో చేరిన మదన్ లాల్కు అధికార పార్టీ మూడు కోట్ల రూపాయలు ఆఫర్ చేసింది. ఈ విషయాన్ని వైరా డీఎస్పీ రామిరెడ్డి చెప్పారని పేర్కొంది.
అది కూడా తెరాసలో ముఖ్య నాయకుడైన కేటీఆర్ను ఉటంకిస్తూ, ఆయన స్వయంగా తనతో చెప్పారని, కేటీఆర్ మాటనే తాను చెబుతున్నానని తెలిపారని రాసింది.
ఓటుకు నోటు కేసులో టీడీపీ అధ్యక్షుడు, చంద్రబాబు ప్రమేయాన్ని బయటపెడుతూ ఆడియో టేపులు విడుదలైన కొద్దిసేపటికే, దీనికి కౌంటర్గా మరో టేపు విడుదలైంది.
ఇది వైరా ఎమ్మెల్యే మదన్ లాల్, డీఎస్పీ రామిరెడ్డి, అజీజ్ అనే కాంట్రాక్టర్తోపాటు మరో ఒకరిద్దరి మధ్య జరిగిన సంభాషణ అని పేర్కొంది. ఓ కోల్డ్ స్టోరేజీకి సంబంధించిన వివాదంపై వారు చర్చించుకుంటున్నారు. ఈ సమయంలో ఎమ్మెల్యే మదన్ లాల్ నిజాయితీ గురించి బలంగా చెప్పేందుకు డీఎస్పీ రామిరెడ్డి ఒక కీలకమైన వ్యాఖ్య చేశారని కూడా దానికి సంబంధించిన అంశాన్ని రాసింది.
కిరణ్ టైమ్లో పది, 20 లక్షలు ఇచ్చినా డీఎస్పీలకు పోస్టింగ్ రాలేదని కానీ, నాకు వైరాలో ఫ్రీగా పోస్టింగ్ వచ్చిందని, సైబరాబాద్ కావాలని కేటీఆర్ను కోరానని అయితే, వైరాకు వెళ్లాలని ఆయన చెప్పారని, మదన్లాల్కు తాము 3 కోట్లు ఇచ్చినా తీసుకోలేదని, తన ఏరియా డెవలప్మెంట్ కావాలని మాత్రం కోరారని తెలిపారని, కేటీఆర్ మాటనే నేను చెబుతున్నానని డీఎస్పీ తెలిపినట్లుగా పేర్కొంది.
దీనిపై విపక్ష ఎమ్మెల్యేలను తెరాస ప్రలోభ పెట్టిందనేందుకు ఇదే నిదర్శనమని టీడీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. మరోవైపు తెరాస నుంచి తనకు ఆఫర్ వచ్చినప్పటికీ, నియోజకవర్గ అభివృద్ధి కోసమే అధికార పార్టీలో చేరినట్లు మదన్లాల్ పలుమార్లు స్వయంగా పేర్కొన్నారని రాసింది.