వాళ్లు మా వాళ్లే, నగదు ఉందనడం అవాస్తవం: తెలంగాణ ఈసీకి ఏపీ డీజీపీ వివరణ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణలో డబ్బు పంచుతున్నారంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల సంఘం ఏపీ పోలీసు శాఖను వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ మంగళవారం సమాధానం ఇచ్చారు.
'బాబూ అరాచకం సృష్టిస్తే ఊరుకోం! ఏపీ పోలీసులతో డబ్బులు పంచుతావా?: రాహుల్తో రూ.500కోట్ల డీల్'
నోటీసులో పేర్కొన్న విధంగా తెలంగాణలో పట్టుబడిన వారు తమ ఇంటెలిజెన్స్ అధికారులేనని ఏపీ డీజీపీ తెలిపారు. అయితే, ఆ అధికారుల వద్ద నగదు ఉంనడం అవాస్తవమని అన్నారు. ఘటనకు సంబంధించిన వీడియోల ఎక్కడా కూడా డబ్బులు కనిపించలేదని అన్నారు.
మావోయిస్టుల కదలికలపై సమాచారం కోసమే ఏపీ అధికారులు తెలంగాణలో ఉన్నారని చెప్పారు. ఇంటెలిజెన్స్ సిబ్బంది ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందని తెలిపారు. ఏపీకి తెలంగాణ ఇంకా ఇంటెలిజెన్స్ యూనిట్ ఉందని ఏపీ డీజీపీ తెలిపారు. ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీతో మాట్లాడిన తర్వాత సమగ్ర సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.
కాగా, నాలుగు రోజుల క్రితం ధర్మపురిలో ఏపీకి చెందిన ముగ్గురు ఇంటెలిజెన్స్ అధికారుల(పోలీసులు)ను తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. వారు డబ్బులు పంచుతున్నారని ఆరోపణలు రావడంతో ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో పలు పార్టీలు ఈసీకి ఫిర్యాదులు కూడా చేశాయి. దీంతో ఏపీ డీజీపీకి తెలంగాణ ఈసీ నోటీసులు జారీ చేసింది.