ఉద్యోగులకు ఏపీ 3ఆప్షన్స్, హైదరాబాద్లో వెంకన్న ఆలయం
హైదరాబాద్/చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వెళ్లేందుకు హైదరాబాదులో నివాసం ఉంటున్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం మూడు ఆప్షన్స్ ఇస్తుంది. హైదరాబాద్ నుంచి అమరావతికి... ఉద్యోగుల తరలింపు పైన ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఇందులో భాగంగా ఉద్యోగులకు మూడు ఆప్షన్స్ ఇస్తూ సర్క్యులర్ జారీ చేసింది. మూడు ఆప్షన్స్లలో.. ఒకటి నవంబర్ 2015, రెండోది జనవరి 2016, మూడోది జూన్ 2016 ఆప్షన్స్ ఇచ్చారు. వీటిలో ఉద్యోగులు ఎన్నుకోవాల్సి ఉంటుంది. అంతకుముందు తరలింపు గడువుపై ఉద్యోగులు సిఎస్ కృష్ణారావుతో మంగళవారం భేటీ అయ్యారు.
బంజారాహిల్స్లో శ్రీవారి ఆలయం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని తిరుమల తిరుపతి కళ్యాణ మండపాలలో ఏసీలు ఏర్పాటు చేస్తామని టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి చెప్పారు. రూ.13.69 కోట్లతో హైదరాబాదులోని బంజారాహిల్స్లో శ్రీవారి ఆలయం నిర్మిస్తామని చెప్పారు.
హైదరాబాద్లో శ్రీవారి ఆలయం నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) పాలకమండలి మంగళవారం నిర్ణయం తీసుకుంది. టిటిడి ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో తిరుమలలో జరిగిన పాలకమండలి సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీవారి ఆర్జిత సేవలు, అద్దె గదుల ధరల పెంపుపై ఉపసంఘం ఏర్పాటు చేశారు. వచ్చే సమావేశం నాటికి నివేదిక ఇవ్వాలని ఉపసంఘాన్ని ఆదేశించారు. తిరుపతిలో అరబిందో నేత్రాలయ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే కంటి ఆస్పత్రికి 6 ఎకరాల స్థలం కేటాయిస్తూ తీర్మానం చేశారు.