ఉద్యోగుల సమస్య: సిఎం రమేష్-కెటిఆర్ మధ్య జగన్ మధ్యవర్తిత్వం?
హైదరాబాద్: ఏపీ స్థానికత కలిగిన పన్నెండు వందల మందికి పైగా విద్యుత్ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం కొద్ది నెలల క్రితం రిలీవ్ చేసింది. ఈ అంశం కోర్టు వరకూ వెళ్లింది. ఏపీ స్థానికత కలిగిన ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం వేతనాలు చెల్లించాలని కోర్టు కూడా చెప్పింది. కోర్టులో కేసు కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా, విద్యుత్ ఉద్యోగుల సమస్య పరిష్కారానికి పార్టీలకు, రాష్ట్రాలకు అతీతంగా నేతలు ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు సిఎం రమేష్ ఈ విషయమై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారని తెలుస్తోందని అంటున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో మాట్లాడి విద్యుత్ ఉద్యోగులకు వేతనాలు ఇప్పించాలని జగన్ను సీఎం రమేష్ కోరారని, దానికి జగన్ కూడా సమ్మతించారని, జగన్ ఈ విషయాన్ని తెలంగాణ సిఎం కెసిఆర్ తనయుడు, మంత్రి కెటిఆర్ దృష్టికి తీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి.
బదలీ అయిన ఉద్యోగులకు ఇప్పటి వరకు వేతనాలు ఇప్పించాలని జగన్ మంత్రి కెటిఆర్ను కోరారని తెలుస్తోంది. ఈ మేరకు విద్యుత్ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర మంత్రి కెటిఆర్ను కలిశారు.
దీంతో, కెటిఆర్ వారికి జీతాలు ఇవ్వాలని తెలంగాణ విద్యుత్ సంస్థల యాజమాన్యంతో చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే, ఈ అంశం కెసిఆర్ పరిధిలో ఉన్నందున ఆ తర్వాత కెటిఆర్ కూడా నిస్సహాయత వ్యక్తం చేశారని అంటున్నారు.
కాగా, ఏపీ స్థానికత కలిగిన విద్యుత్ ఉద్యోగులను తెలంగాణ రిలీవ్ చేయగా.. వారు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. తమ భవిష్య నిధి నుంచి పాక్షికంగా డబ్బులు విడుదల చేయాలని తెలంగాణ విద్యుత్ సంస్థకు దరఖాస్తు చేసుకున్నారు. భవిష్య నిధి నుంచి చెల్లింపులు జరపనున్నారని తెలుస్తోంది.