ఉద్యోగుల్లో చిచ్చుపెట్టేందుకు ఏపీ ఎన్జీవోల కుట్ర..! ఆటలు సాగనివ్వమంటున్న టీఎన్జీవోలు..!!
హైదరాబాద్: ఏపీ, తెలంగాణ ఉద్యోగుల మద్య సొసైటీ భూముల వ్యవహారం ఆరని మంటలను రగుల్చుతూనే ఉంది. రాష్ట్ర విభజన తర్వాత అమరావతికి వెళ్లినప్పటికీ ఏపీఎన్జీవోల సంఘం తెలంగాణ ఉద్యోగుల్లో చిచ్చుపెట్టేందుకు ఇంకా కుట్రచేస్తున్నదని టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్రెడ్డి, టీజీవో అధ్యక్షురాలు వీ మమత ఆరోపించారు. గచ్చిబౌలి హౌసింగ్సొసైటీ ఎన్నికలు జరుగకుండా, అక్కడ జరిగిన కుంభకోణాలు బయటకు రాకుండా కోర్టులో కేసులు వేసి సంవత్సరాల తరబడి అడ్డుకున్న ఏపీఎన్జీవోలు ఇప్పుడు కొత్త నాటకానికి తెరలేపారని ధ్వజమెత్తారు.
హౌసింగ్ సొసైటీ భూముల కోసం కొత్త నాటకం..! ఏపీఎన్జీవోలపై టీఎన్జీవోలు గరంగరం..!!
టీఎన్జీవో అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడిరాష్ట్రంలో ఏపీఎన్జీవోల సంఘం ముసుగులో 18 కోట్ల కుంభకోణానికి పాల్పడి, క్రిమినల్ కేసులు నమోదైనవారు ఇప్పుడు అమరావతిలో ఉద్యోగం చేసుకుంటూ తెలంగాణ ఉద్యోగుల్లో చిచ్చుపెడుతున్నారన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక్క డైరెక్టర్ కూడా లేకుండా అమరావతిలో ఉండేవారితోనే ప్యానెల్ ఏర్పాటుచేసి, గచ్చిబౌలి సొసైటీ ఎన్నికల్లో పోటీచేస్తున్నారని వివరించారు.
అమరావతిలో ఉంటూ ఇక్కడ పోటీనా..! హాస్యాస్పదం అంటున్న టీ ఉద్యోగులు..!!
హౌసింగ్ సొసైటీ ఎన్నికలు జరుగకుండా ఐదేండ్లుగా కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్న ఏపీఎన్జీవోలసంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి ఇక్కడ సొసైటీ డైరెక్టర్గా పోటీచేయడం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు.హౌసింగ్ సొసైటీలో ఇప్పటికే వాటాధనం చెల్లించి, ప్లాట్ల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ ఉద్యోగులు భాగ్యనగర్ తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగులసంఘం పేరుతో అసోసియేషన్ ఏర్పాటుచేసుకుని, సమస్యలు పరిష్కరించుకుంటున్నారని, సొసైటీ ఎన్నికలు జరిపేలా తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నుంచి అత్యవసర ఆదేశాలు ఇప్పించుకున్నామని వివరించారు.
సొసైటీ భూముల అంశంలో ఏపీఎన్జీవోల పెత్తనం..! ఇక సహించేది లేదంటున్న టీఎన్జీవో..!!
సొసైటీ ఎన్నికలు జరిగితే భూముల వ్యవహారం కొలిక్కి వస్తుందని తెలిపారు. అమరావతిలో ఉద్యోగాలు చేస్తున్నవారిని ఇక్కడి సొసైటీ డైరెక్టర్లుగా ప్యానెల్ ఏర్పాటుచేసి పోటీచేయిస్తున్నారని, అక్కడ ఉండేవారు ఏ హోదాలో ఇక్కడి భూములను ఎలా పంచుతారని ప్రశ్నించారు. ఇప్పటికే ఉద్యోగుల జేఏసీ తరపున గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీని భాగ్యనగర్ ఎన్జీవోలకు ఇవ్వాలని సీఎం కేసీఆర్కు విన్నవించామని, దానిపై ఆయన సానుకూలంగా ఉన్నారని, సమస్య పరిష్కారమవుతుందనే సమయంలో ఏపీఎన్జీవోలు మళ్లీ అడ్డుపడుతున్నారని ఆరోపించారు.
తెలంగాణ సీయం కి ఫిర్యాదు..! త్వరలో సమస్య పరిష్కరం అంటున్న ఉద్యోగులు..!!
ఏపీ ఎన్జీవోలు మళ్లీ ఇప్పుడు ఉద్యోగులను రెచ్చగొడుతూ వివాదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, ఏపీ ఎన్జీవోలలో ఉన్న తెలంగాణ, ఏపీ ఉద్యోగులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. భాగ్యనగర్ తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల తరపున సత్యనారాయణగౌడ్ ప్యానెల్ను గెలిపించాలని, వీరితోనే భూముల సమస్య పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. ప్లాట్లు పంచితే టీఎన్జీవోలకు ఉద్యోగుల్లో మంచిపేరు వస్తుందనే కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా హౌసింగ్ ఎన్నికల్లో పోటీచేస్తున్న సత్యనారాయణగౌడ్ ప్యానెల్కు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు.