మాకు సేవలు: తెలుగు విశ్వవిద్యాలయంపై ఏపీ, ఓపెన్ స్కూల్ సొసైటీ ఖాతాకు ఓకే
హైదరాబాద్: ఏపీలో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తన సేవలను నిలిపి వేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ఉన్నత విద్యా శాఖ గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
గతంలో మాదిరి ఏపీలోని క్యాంపస్లకు సేవలు కొనసాగించేలా తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఆదేశించాలని ఏపీ ఉన్నత విద్యా శాఖ పిటిషన్ దాఖలు చేశారు. హైదరాబాదులో ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న తెలుగు విశ్వవిద్యాలయానికి ఏపీలోని రాజమండ్రి, శ్రీశైలం, కూచిపుడిలలో క్యాంపస్లు ఉన్నాయన్నారు.
అయితే, తన సేవలను తెలంగాణకు మాత్రమే పరిమితం చేస్తూ విశ్వవిద్యాలయం తీసుకున్న నిర్ణయం వల్ల విద్యార్థులు, సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. దీనిని పరిగణలోకి తీసుకొని ప్రేశాలకు జారీ చేసిన ప్రకటన, సేవలు నిలిపివేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు చట్ట విరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరారు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ను వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చారు.
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఖాతా నిర్వహణకు హైకోర్టు అనుమతి
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీకి చెందిన ఖాతా నిర్వహణకు అనుమతి ఇవ్వాలని ఎస్బీఐని హైకోర్టు ఆదేశించింది. ఖాతాలను స్తంభింప చేసే నాటికి ఉన్న సొమ్ము నిల్వలను అలాగే ఉంచాలని ఆదేశించింది. ఏపీ ఇంటర్ బోర్డు ఖాతాల స్తంభన వ్యవహారంలో గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు ఈ వ్యాజ్యంలోను వర్తిస్తాయని హైకోర్టు పేర్కొంది. తదుపరి విచారణను 10వ తేదీకి వాయిదా వేసింది.