జగన్కు చంద్రబాబు షాక్, కోదండకు కేసీఆర్ కేసుల ట్విస్ట్: 'విఫల' వాదన
నిన్న ఏపీలో, నేడు తెలంగాణలో ధర్నాలను, ర్యాలీలను పోలీసులు అడ్డుకున్నారు. గత నెల జనవరి 26వ తేదీన జల్లికట్టు తరహాలో ప్రత్యేక హోదా కోసం విశాఖ ఆర్కే బీచ్ వద్ద ర్యాలీకి పిలుపునిచ్చారు.
హైదరాబాద్: నిన్న ఏపీలో, నేడు తెలంగాణలో ధర్నాలను, ర్యాలీలను పోలీసులు అడ్డుకున్నారు. గత నెల జనవరి 26వ తేదీన జల్లికట్టు తరహాలో ప్రత్యేక హోదా కోసం విశాఖ ఆర్కే బీచ్ వద్ద ర్యాలీకి పిలుపునిచ్చారు.
దానికి వైసిపి, జనసేన మద్దతు పలికింది. అయితే, సోషల్ మీడియాలో జరిగిన ప్రచారానికి ఎవరు బాధ్యత వహిస్తారని, అలాంటి వారికి ఎవరో బాధ్యత వహించే వారు ముందుకు రావాలని పోలీసులు చెప్పారు.
నాడు విశాఖలో అడ్డు
అంతేకాదు, జనవరి 26వ తేదీ కావడం, ఆ మరుసటి రోజు విశాఖలో పార్ట్నర్ షిప్ సమ్మిట్ ఉండటంతో ఇప్పటికిప్పుడు అనుమతి కుదరదని పోలీసులు చెప్పారు. మొత్తానికి ఆర్కే బీచ్లో నిరసన కార్యక్రమం ఫలప్రదం కాలేదు.
నేడు హైదరాబాదులో అడ్డు
తాజాగా, బుధవారం నాడు హైదరాబాదులో తెలంగాణ జేఏసీ తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. జల్లికట్టు తరహా ఉద్యమిస్తామని జేఏసీ చెబుతోందని విమర్శలు వచ్చాయి.
మొత్తానికి జేఏసీ ర్యాలీ కోర్టుకు చేరింది. నాగోల్ మెట్రో మైదానంలో ర్యాలీకి అనుమతి వచ్చింది. కానీ అది అనుకూలంగా ఉండదని, తాము ముందు ఇందిరా పార్క్ వద్దే ర్యాలీ నిర్వహిస్తామని జేఏసీ చైర్మన్ కోదండరాం మంగళవారం తేల్చి చెప్పారు.
కోదండ అరెస్ట్
దీంతో బుధవారం అర్ధరాత్రి సమయంలో పోలీసులు ఆయన ఇంటికి వచ్చి, తలుపులు బద్దలు కొట్టి ఆయనను అరెస్టు చేశారని.. కోదండరాం సతీమణి, టీజేఏసీ నాయకులు, విపక్షాలు ఆరోపిస్తున్నాయి. జేఏసీ ర్యాలీ కూడా సఫలం కాలేదు.
విఫలమయ్యాయా?
ఇక్కడి దాకా, ఓకే... కానీ నిన్న ఏపీలో జనవరి 26న జరగుతుందనుకున్న జల్లికట్టు తరహా హోదా ఉద్యమం, నిన్న హైదరాబాదులో నిరుద్యోగ ర్యాలీ విజయవంతం కాలేదని, అధికార పార్టీ నేతలు చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ర్యాలీలకు అనుమతివ్వలేదు
తొలుత అసలు ఆ ర్యాలీలకు అనుమతి ఇవ్వలేదు. పైగా... ఎక్కడికి అక్కడ అరెస్టులు, భారీ పోలీసు బందోబస్తు, ఈ ర్యాలీల్లో పాల్గొంటే క్రిమినల్ కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించడం.. ఇవన్నీ చేసి విఫలమయ్యాయని చెప్పడం విడ్డూరమంటున్నారు.
ముందస్తు అరెస్ట్
జిల్లాల నుంచి తరలి వస్తున్న వారిని ఎక్కడికి అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోదండరాం సహా పలువురు జేఏసీ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు.
అధికార పార్టీల 'విఫల' యత్నాలు
మంగళవారం నాటికే 500 మంది జేఏసీ నాయకులను అరెస్టు చేసినట్లు కోదండ చెప్పారు. ఏపీలోనైనా లేదా తెలంగాణలో అయినా అరెస్టు చేయడం లేదా, పోలీసులతో అడ్డుకోవడం చేశారు. పోలీసులతో అడ్డుకొని.. మళ్లీ అధికార పార్టీ నేతలే.. ర్యాలీలు విఫలమయ్యాయని, విపక్షాలు లేదా టీజేఏసీ తలపెట్టిన ధర్నాకు ప్రజామోదం లేదని, నిరుద్యోగులు, విద్యార్థులు పాల్గొనలేదని, వారి ఆందోళనలు విఫలమయ్యాయని చెప్పడం ఏమిటనే వాదనలు వినిపిస్తున్నాయి.
బాల్క సుమన్ ఇలా...
ర్యాలీని పట్టించుకోనందుకు నిరుద్యోగ యువతకు కృతజ్ఞతలు అని బాల్క సుమన్ గురువారం అన్నారు. నిరుద్యోగ ర్యాలీకి దూరంగా ఉండి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల తమ విశ్వాసాన్ని చాటారన్నారు. జనవరి 26న ఏపీలోను ఇదే జరిగింది. అడ్డుకొని, ఆ తర్వాత విఫలమయ్యారని చెప్పారు.
కేసీఆర్ ఝలక్.. విపక్షాలు షాక్
కోదండరాం, ఇతర జేఏసీ నేతల పైన తెలంగాణ ప్రభుత్వం చూపిన కేసుల పైన జేఏసీ నేతలతో పాటు విపక్షాలు కూడా షాక్కు గురవుతున్నాయి. తెలంగాణ ఉద్యమం సమయంలో పెట్టిన కేసులను తెలంగాణ పాలనలోని పోలీసులు చూపించడం గమనార్హం. అందుకే.. ఉద్యమం సమయంలోని కేసులను పోలీసులు చూపిస్తున్నారని, తమ మీద ఉన్న కేసులే సీఎం కేసీఆర్ పైన ఉన్నాయని, సమైక్య పాలన కేసులను చూపించడం ద్వారా మన పాలనలోని పోలీసులు మన ఉద్యమాన్నే అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ కేసులను కుట్రపూరితంగా వాడుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వం
సమైక్య పాలకులు పెట్టిన కేసులను తెలంగాణ జేఏసీ నేతల పైన కేసీఆర్ ప్రభుత్వం కుట్రపూరితంగా వాడుకుంటుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల కోసం నిరసన ర్యాలీ చేపడామంటే.. ర్యాలీలో విద్రోహశక్తులు చొడపడతారని చెప్పడం విడ్డూరమంటున్నారు.