రైతన్నను విస్మరించిన ముఖ్యమంత్రులు.. నేతలందరిదీ అదే దారి..!
హైదరాబాద్ : డిసెంబర్ 23. జాతీయ రైతు దినోత్సవం. దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలను గుర్తించాల్సిన రోజు. కానీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రైతన్నను మరచిపోయారు. కాదు కాదు విస్మరించారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఎన్నికల వేళ రైతన్నలను ఆకాశానికెత్తే పొలిటికల్ హడావిడి.. డిసెంబర్ 23నాడు ఏమైంది. అన్నదాతల కోసం అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని డప్పులు కొట్టుకోవడమే తప్ప వారికోసం చేసిందేమీ లేదనే ఆరోపణల నేపథ్యంలో జాతీయ రైతు దినోత్సవం విస్మరించడం హాట్ టాపిక్గా మారింది.
చరణ్ సింగ్ జన్మదినం.. రైతు దినోత్సవం
డిసెంబర్ 23 ను జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకోవడంలో విశేషముంది. 5వ ప్రధానమంత్రిగా దేశానికి సేవలందించిన చౌదరి చరణ్ సింగ్ పుట్టినరోజు పురస్కరించుకుని దీన్ని ప్రకటించారు. ఆయన చేసిన అనేక ఉద్యమాల ఫలితంగా జమీందారి చట్టం రద్దయింది. అంతేకాదు కౌలుదారీ చట్టం అమలయింది. అలాగే రైతులకు బ్యాంక్ రుణాలు అందించడం కూడా ఆయన హయాంలోనే ప్రారంభమైంది. అంతలా రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేసిన చరణ్ సింగ్ సేవలకు గుర్తింపుగా ఆయన పుట్టినరోజును జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించడం జరిగింది.
కనీసం శుభాకాంక్షలు చెప్పలేదే..!
జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపవాదు మూటగట్టుకున్నారు. కనీసం అన్నదాతలకు శుభాకాంక్షలు చెప్పకపోవడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఇద్దరు చంద్రులు రైతన్నలను పూర్తిగా విస్మరించారనే టాక్ వినిపిస్తోంది. ఆయా సందర్బాల్లో పత్రికలు, టీవీల్లో ప్రకటనల మీద ప్రకటనలు గుప్పించే వీరిద్దరు.. డిసెంబర్ 23న ఒక్క ప్రకటన కూడా విడుదల చేయకపోవడం విడ్డూరమంటున్నారు కొందరు. అవసరంలేని వాటికి సైతం రంగురంగుల యాడ్స్ ఇస్తూ.. జాతీయ రైతు దినోత్సవం నాడు శుభాకాంక్షలు కూడా చెప్పకపోవడం దారుణమంటున్నారు.
గుర్తులేదా? విస్మరించారా?
రైతుబంధు, రైతుబీమా పథకాలతో దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్ గా నిలుస్తోందంటున్నారు కేసీఆర్. అటు వ్యవసాయం మీద తాము పెట్టినంత ఖర్చు ఎవరూ పెట్టడం లేదంటున్నారు చంద్రబాబు. అన్నదాతల కోసం అంతచేస్తున్నోళ్లు మరి జాతీయ రైతు దినోత్సవం ఎలా మిస్సయరబ్బా అనేది ప్రశ్నార్థకం. అన్నదాతలకు అన్నివిధాలుగా అండగా ఉంటామని పదేపదే చెప్పే కేసీఆర్.. రైతుబంధు, రైతుబీమా పథకాల వివరాలతో కూడిన ప్రకటన దేశవ్యాప్తంగా అన్నీ పత్రికలకు ఇచ్చారు.
అలాంటిది జాతీయ రైతు దినోత్సవం నాడు అన్నదాత కనిపించలేదా? లేదంటే మర్చిపోయారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అటు చీటికిమాటికి కార్యక్రమాల మీద కార్యక్రమాలు నిర్వహించే చంద్రబాబుకు డిసెంబర్ 23 ఎందుకు గుర్తులేనట్టో? ఈ ఇద్దరు చంద్రులకు తోడు ఆయా పార్టీల నేతందరిదీ అదే దారి. ఏ ఒక్కరూ కూడా జాతీయ రైతు దినోత్సవం నిర్వహించిన దాఖలాలు లేవు.