ఎక్కువ తీసుకుంటున్నారు, వారి లెక్కలో వేయండి: ఏపీ-తెలంగాణ పరస్పర ఫిర్యాదు
హైదరాబాద్: జూరాల, శ్రీశైలం నుంచి తెలంగాణ రాష్ట్రం ఎక్కువ నీరు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. కృష్ణా నీటి పైన ఇరు తెలుగు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. పోతిరెడ్డిపాడు వద్ద ఏపీ ఎక్కువ నీటిని వాడుకుంటోందని ఈ నెల 8న తెలంగాణ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది.
జూరాల, శ్రీశైలం నుంచి తెలంగాణ ఎక్కువ నీటిని తీసుకుని లెక్కల్లో చూపడం లేదని ఫిర్యాదు చేస్తూ బుధవారం ఏపీ.. కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. తీసుకొన్న నీటిని చూపడానికి వీలుగా రెండు రాష్ట్రాల అధికారులతో సంయుక్త పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని కోరింది.
తెలంగాణ ఫిర్యాదు చేసి కొద్ది రోజులకే ఏపీ ఈ ఫిర్యాదు చేసింది. పోతిరెడ్డిపాడు వద్ద సంయుక్త పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని తెలంగాణ కోరగా, జూరాల వద్ద కూడా అలాగే ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ కోరుతోంది.
తెలంగాణ ఎక్కువగా వాడుకొన్న నీటిని వారి వాటాలోనే వేయాలని, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణా బోర్డు పరిధి నిర్ణయించేవరకు రెండు రాష్ట్రాల అధికారులతో జూరాల, శ్రీశైలం వద్ద సంయుక్త యాజమాన్యాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ కోరింది.