రాజ్నాథ్ హింట్!: నరసింహన్ వెళ్తారా.. రాజీనామా లేక ట్రాన్స్ఫరా?
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ వెళ్ళిపోనున్నారా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. సెక్షన్ 8 విషయమై గవర్నర్ నరసింహన్ పైన ఏపీ ప్రభుత్వం ఆయన పైన మండిపడిన విషయం తెలిసిందే. ఆయన పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ఆయన మనస్తాపం చెందారని, రాజీనామా చేస్తారని కొద్ది రోజుల క్రితం ఊహాగానాలు వినిపించాయి. దాంతో పాటే నరసింహన్ను ఉభయ రాష్ట్రాల గవర్నర్గా తొలగించి, ఓ రాష్ట్రానికి మరొకరిని నియమిస్తారని, రెండు రాష్ట్రాలకూ కొత్త గవర్నర్లను నియమిస్తారని... ఇలా పలు ఊహాగానాలు వచ్చాయి.
తాజాగా, మరోసారి గవర్నర్ మార్పుపై ఊహాగానాలు వస్తున్నాయి. ఆంగ్ల పత్రికల్లో వస్తున్న వార్తల ప్రకారం.. గవర్నర్ నరసింహన్ను వేరే రాష్ట్రానికి గవర్నర్గా పంపించడం లేదా రాజీనామా చేయమని కేంద్రం ఆదేశించడం చేయవచ్చునని అంటున్నారు.
ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. సమావేశాలు ముగిశాక ఆయన పైన కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవచ్చునని తెలుస్తోంది. పలు ప్రాంతాల్లో గవర్నర్లను నియమించాల్సి ఉందని కేంద్రం భావిస్తోందని తెలుస్తోంది.
కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఈ విషయంపై ఇటీవల రాష్ట్రపతి భవన్లో జరిగిన విందులో మాట్లాడినట్లుగా చెబుతున్నారు. పార్లమెంటు సమావేశాలు అయ్యాక.. అంటే వచ్చే నెల నరసింహన్ రాజీనామా చేయడం లేదా మరో రాష్ట్రానికి వెళ్లిపోవడం జరగవచ్చునని అంటున్నారు.
విభజన అనంతరం గవర్నర్ నరసింహన్ పని తీరు పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తోంది. తెలంగాణలోని కాంగ్రెస్, టిడిపి, బిజెపిలు కూడా సంతృప్తిగా లేవు.
ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా పని చేసిన నరసింహన్ డిసెంబర్ 31, 2006 బాధ్యతలను త్యజించారు. ఆ తర్వాత జనవరి 25, 2007న ఛత్తీస్గఢ్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2010లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు.
ఆ తర్వాత గవర్నర్గా నరసింహన్ టర్మ్ అయిపోయాక మరోసారి రీ అపాయింట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం జూన్ 2, 2014 నుండి తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు గవర్నర్గా కొనసాగుతున్నారు.