మాకు న్యాయం ఏది: మోడీ ప్రభుత్వంపై ఏపీ, తెలంగాణ అసంతృప్తి
న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీలకు తగినంత న్యాయం జరగడం లేదని రెండు రాష్ట్రాల ఎంపీలు మంగళవారం నాడు అసంతృప్తి వ్యక్తం చేశారు. లోకసభలో రైల్వే బడ్జెట్పై జరిగిన చర్చలో టిడిపి లోకసభాపక్ష నేత తోట నరసింహం మాట్లాడారు.
బడ్జెట్ ఆశాజనకంగా ఉన్నా ఏపీకి మాత్రం తగినంత కేటాయింపులు లేవని పెదవి విరిచారు. ఈ బడ్జెట్లో తమకు సహాయ హస్తం అందలేదనే భావన ఏపీ ప్రజల్లో ఉందన్నారు. విభజన తర్వాత రాష్ట్రం అనూహ్య ఇబ్బందుల్లో చిక్కుకొందనీ, గతంలో చేసిన వాగ్దానాలను నెరవేర్చే బాధ్యత కేంద్రానిదేనన్నారు.
వైసిపి ఎంపీ వరప్రసాదరావు మాట్లాడుతూ.. చాలా ఏళ్లుగా పెండింగులో ఉన్న తిరుపతి రైల్వే స్టేషన్ ఆధునికీకరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కోరారు.
టిఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ... ఓ రైలుకు పేరు మార్చాలన్నా ఎంతో సమయం తీసుకొంటోందనీ, నిబంధనల్ని ఈ మేరకు మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఖాజీపేటలో రైలుపెట్టెల కర్మాగారాన్ని నెలకొల్పాలనీ, హైదరాబాద్ నుంచి అమరావతికి ఫాస్ట్ ట్రాక్ రైలును ప్రవేశపెట్టాలనీ కోరారు.
ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కేంద్ర న్యాయశాఖ మంత్రిని మంగళవారం డిమాండ్ చేశారు. లోకసభలో ఆయన ఈ విషయాన్ని లేవనెత్తారు. విభజన నేపథ్యంలో ఇచ్చిన ఈ హామీని నెరవేర్చాలన్నారు. ప్రత్యేక హైకోర్టు లేకపోవడంతో రెండు రాష్ట్రాల మధ్య పలు సమస్యలు తలెత్తుతున్నాయన్నారు.