బెజవాడ నుంచి పాదయాత్ర: కేసీఆర్ కోసం ప్రచారం చేస్తానని ఏపీ రోహిత్, కేటీఆర్ ఆలింగనం
హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, తెరాస మళ్లీ గెలవాలని ఆకాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన రోహిత్ కుమార్ రెడ్డి విజయవాడ నుంచి హైదరాబాదుకు పాదయాత్ర చేశారు. ఆయన పదిహేడు రోజుల పాటు పాదయాత్ర చేశారు.
ఎదురుచూశా, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతావా, గుండెల్లో స్థానంలేదు: కేసీఆర్పై విజయశాంతి
కేటీఆర్ను కలిసిన నెల్లూరు రోహిత్ కుమార్ రెడ్డి
17 రోజులు పాదయాత్ర చేసిన రోహిత్ కుమార్ రెడ్డి మంత్రి కేటీ రామారావును కలిశారు. దీనిని టీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేయగా, కేటీఆర్ రీట్వీట్ చేశారు. 'ఆంధ్రప్రదేశ్, నెల్లూరుకు చెందిన రోహిత్ కుమార్ రెడ్డి అనే యువకుడు టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితుడై, పార్టీ గెలుపును కాంక్షిస్తూ గత 17 రోజులుగా విజయవాడ నుండి పాదయాత్ర చేస్తూ హైదరాబాద్ చేరుకున్నాడు.ఈ సందర్బంగా మంత్రి @KTRTRS గారిని కలవడం జరిగింది' అని పేర్కొన్నారు.
ఎన్నికల్లో ప్రచారం చేస్తా
ఈ సందర్భంగా ఆదివారం రోహిత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... యువతరానికి స్ఫూర్తినిచ్చేలా కేటీఆర్ ముందుకు సాగుతున్నారన్నారు. ఆయన పట్ల తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకోవడానికి కేటీఆర్ ముఖచిత్రాన్ని తన గుండెలపై టాటూగా వేయించుకున్నానని అన్నారు. తనది ఏపీ అయినప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న అభివృద్ది తేడాను గమనించి మంత్రికి వివరించానన్నారు. రైతుల కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు అద్భుతమన్నారు. హైదరాబాద్ నగరానికి చేరుకున్న రోహిత్ను టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులుశ్రీనివాస్ యాదవ్ తదితరులు మంత్రి కేటీఆర్ వద్దకు తీసుకు వచ్చారు. రోహిత్ను కేటీఆర్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని కుశల ప్రశ్నలు అడిగారు. ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశం కల్పించాలని రోహిత్ చేసిన విజ్ఞప్తికి మంత్రి సానుకూలంగా స్పందించారు.
నాడు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ రోహిత్ కుమార్ రెడ్డి విజయవాడ నుంచి హైదరాబాదుకు కాలి నడకన పాదయాత్ర చేస్తున్నారంటూ గతంలో కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. ఇందుకు కేటీఆర్ రోహిత్కు థ్యాంక్స్ చెప్పారు. కేసీఆర్కు, తెరాసకు మద్దతుగా ఏపీకి చెందిన రోహిత్ విజయవాడ నుంచి హైదరాబాద్ పాదయాత్ర చేస్తున్నారని నాడు వారం క్రితం కేటీఆర్ ట్వీట్ చేసి, ధన్యవాదాలు తెలిపారు.
చంద్రబాబుతో ప్రచారం చేయించే దమ్ముందా?
మహాకూటమి పేరుతో సర్కస్ టీమ్ బయలుదేరిందని మరో టీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మేనిఫెస్టో రూపొందించలేని దుస్థితిలో మహాకూటమి ఉందని విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఇక్కడ (తెలంగాణ) ప్రచారం చేయించే దమ్ము కాంగ్రెస్ పార్టీ నేతలకు ఉందా అని సవాల్ చేశారు.
ఏపీ యువత కూడా తెరాస గెలుపు కోరుకుంటోంది
పాలమూరులో కాంగ్రెస్ ప్రచారం అట్టర్ ప్లాప్ అయిందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎన్నికల తర్వాత ప్రతిపక్షం ఉండనే ఉండదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యువత కూడా తెలంగాణలో టీఆర్ఎస్ గెలుపును కోరుకుంటోందని చెప్పారు. తెలంగాణలో జాతీయ పార్టీలకు స్థానం లేదని చెప్పారు.