ఓవైపు కరోనా... మరోవైపు బోనాలు.... ఆ విషయంలో జోక్యం చేసుకోమన్న హైకోర్టు...
కరోనా వైరస్ వ్యాప్తితో ఈసారి భాగ్యనగరంలో బోనాల పండుగ నిరాడంబరంగా జరుగుతోంది. వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా భక్తులను అమ్మవార్ల దర్శనానికి అనుమతివ్వట్లేదు. ఇదే క్రమంలో బోనాల ఘటాల ఊరేగింపు విషయంలో తామేమీ చేయలేమని తాజాగా హైకోర్టు స్పష్టం చేసింది.అనుమతి కోసం మరోసారి సౌత్ జోన్ డీసీపీకి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పాతబస్తీలో ఉన్న శాలిబండ అక్కన్న మాదన్న ఆలయ నిర్వాహకులు ఘటాల ఊరేగింపు అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం ఇలా స్పందించింది.
కరోనా సాకుతో ప్రభుత్వం తమను సంప్రదించకుండా బోనాల పండుగను నిలిపివేసిందంటూ ఆలయ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు.ఘటాలతో పాటు 3కి.మీ మేర అమ్మవారిని ఊరేగించేందుకు అనుమతివ్వాలని కోరారు.సామాజిక దూరాన్ని పాటిస్తూ ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. ఏటా జరిపే సంప్రదాయాలకు విఘాతం కలిగించకుండా చూడాలన్నారు. ఇటీవల పూరీ జగన్నాథ్ రథయాత్రకు సుప్రీం అనుమతిచ్చిన విషయాన్ని న్యాయమూర్తి ముందు ప్రస్తావించారు.
Recommended Video
అయితే కరోనా నిబంధనల నేపథ్యంలో ఊరేగింపులకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదని దేవాదాయ శాఖ కోర్టుకు తెలిపింది.ఇప్పటికే జరిగిన గోల్కొండ, సికింద్రాబాద్ బోనాలకు కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేసింది. అర్చకులు పూజలు చేసుకోవచ్చు తప్ప.. ఘటాల ఊరేగింపుకు అనుమతి లేదని తెలిపింది. ఇరువురి వాదనలు విన్న కోర్టు... ఆలయ నిర్వాహకులు అనుమతుల కోసం మరోసారి సౌత్ జోన్ డీసీపీకి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అలాగే పూరీ జగన్నాథ్ రథయాత్రకు సుప్రీం అనుమతులను పోలీసులు పరిశీలించాలని సూచించింది.