అరబిక్ రాస్తే ఉర్దూకి రిజల్ట్ ... అందులోనూ సున్నా మార్కులు .. విద్యార్థినికి ఒక సంవత్సరం నష్టం
ఇంటర్మీడియట్ బోర్డు లీలలు ఇంతింత కాదయా అన్న చందంగావుంది తాజా పరిస్థితి . పరీక్షా కేంద్రానికి ఒక్క నిముషం ఆలస్యం అయినా అనుమతించని ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థుల అతి ముఖ్యమైన పరీక్షా ఫలితాల విషయంలో చెప్పలేనంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఇంటర్ బోర్డు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది.
విద్యార్థులు భవిష్యత్ తో ఇంటర్ బోర్డు చెలగాటం .. ఆందోళనలో విద్యార్థులు
ఇటీవల విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో చోటు చేసుకున్న అవకతవకలు విద్యార్థుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. పరీక్షలన్నీ బాగా రాసిన ఫలితాలలో ఫెయిల్ అయినట్టు గా వచ్చిందని బోరున విలపించిన ఓ విద్యార్థిని తాను పాస్ అయినట్లుగా మెమో రావడంతో గందరగోళంలో పడిది ఏకంగా తానూ రాయని పరీక్షలు రాసినట్టుగా, రాసిన పరీక్షలు రాయనట్టుగా వచ్చి ఓ విద్యా సంవత్సరం కోల్పోయే ప్రమాదంలో పడింది మరో విద్యార్థిని .ఇంటర్మీడియట్ ఫలితాల్లో బోర్డ్ చేసిన నిర్వాకానికి రాష్ట్రంలోని విద్యార్ధులంతా గందరగోళానికి గురయ్యారు. టాపర్స్ లను కూడా ఫెయిల్ అయ్యారని వెల్లడించటం బోర్డ్ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. దీంతో ఆందోళనలకు గురైన విద్యార్ధులువారి తల్లిదండ్రులు ఇంటర్ బోర్డ్ ఆఫీస్ వద్ద ఈ రోజు కూడా ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.
ఒకే విద్యార్థికి రెండు మెమోలు .. ఒకటి పాస్ మరొకటి ఫెయిల్ .. డైలమాలో విద్యార్ధి భవిష్యత్
అరబిక్ రాస్తే ఉర్దూ పేపర్ కు రిజల్ట్ .. అది కూడా సున్నా మార్కులు .. షాక్ లో విద్యార్థిని
ఈ క్రమంలో ఓ విద్యార్థినికి తాను రాసిన పరీక్షలు రాయనట్లుగా..రాయని సబ్జెక్టు రాసినట్లుగా ఇంటర్ ఫలితాల్లో వెల్లడయ్యాయి. దీంతో ఆ విద్యార్థిని అవాక్కయ్యింది . నల్గొండ పట్టణం బీటీఎస్కు చెందిన ఎండీ.నౌషిన్ హైదరాబాద్లోని హయత్నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో 2018లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసింది. యూనాని మెడిసిన్ కోసం ఈ 2019 మార్చిలో అరబిక్ పేపర్ - 1, 2 పరీక్షలు (ఎక్స్టర్నల్ లాంగ్వేజ్) రాసింది. కానీ ఇంటర్ ఫలితాల్లో మాత్రం నౌషిన్ రాసిన పరీక్షల పేపర్లు కాకుండా ఉర్దూ పేపర్-1, 2 రాసినట్లు రావటమే కాక ఆ పరీక్షల్లో 0 మార్కులు వచ్చినట్లు ఇంటర్నెట్ లిస్ట్ లో రావటంతో నౌషిన్ కు ఏం చెయ్యాలో పాలు పోలేదు.
ఈ ఫలితాలతో ఒక విద్య సంవత్సరం వేస్ట్ అవుతుంది అని ఆవేదనలో విద్యార్థిని
తాను రాసిన అరబిక్ పేపర్- 1, 2లలో కనీసం 90 మార్కులు వస్తాయని..తాను ఆ పరీక్షలు అంతా బాగా రాశాననీ కానీ తనకు 0 మార్కులు రావటమేంటని నౌషీన్ ఆందోళన వ్యక్తం చేస్తుంది . ఈ సబ్జెక్టుల్లో మంచి మార్కులు వస్తే యూనాని మెడిసిన్ చేరదామని అనుకున్నానని నౌషిన్ లబోదిబోమంటుంది. ఇప్పుడేం చేయాలో అర్థం కావటంలేదంటు వాపోయింది. ప్రస్తుతం రీవాల్యుయేషన్కు అప్లై చేసుకున్నానని తెలిపింది. తనకు జరిగిన అన్యాయంపై కుటుంబసభ్యులతో కలిసి గత రెండు రోజులుగా ఇంటర్ బోర్డు ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవటంలేదంటు నౌషిన్ పేర్కొంది . మరి ఇలాంటి విద్యార్థులు విషయంలో ఇంటర్ బోర్డు ఏం చేస్తుందో వేచి చూడాలి.