2019 మార్చి బిల్లు ఇప్పుడు కట్టండి .. టీఎస్ఈఆర్సీ ఆదేశాలు.. షాక్ లో వినియోగదారులు
కరోనా వైరస్ ను కట్టడి చెయ్యటానికి ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. ఏప్రిల్ 14 వరకు ఎవరూ ఇళ్ళు దాటి బయటకు రావద్దని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చెయ్యటంతో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ సమయంలో కరెంట్ బిల్లులు మూడు నెలల పాటు చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రం మూడు నెలల మారటోరియం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ కు కూడా ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆ నిర్ణయాన్ని పట్టించుకోకుండా ఇదే సమయంలో కరెంట్ బిల్లులు చెల్లించాలని కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి జనాలు షాక్ అయ్యే ఆదేశాలను జారీ చేసింది. దీంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు.
దేశంలోనే టాప్ 25 ఐపీఎస్ ల జాబితాలో చోటు ... టాప్ 4 స్థానంలో తెలంగాణా డీజీపీ
గతేడాది మార్చిలో వచ్చిన కరెంట్ బిల్లును ఇప్పుడు కట్టాలని నిర్ణయం తీసుకున్న విద్యుత్ సంస్థలు
ప్రతి నెల మీటర్ రీడింగ్ చూసి బిల్ ఇచ్చే వారు విద్యుత్ శాఖ సిబ్బంది . కరోనా భయం నేపధ్యంలో ఫిబ్రవరికి ముందు వినియోగదారుడు చెల్లించిన మూడు నెలల బిల్లును చూసి అందులో సగటు ప్రాతిపదికన మార్చినెల విద్యుత్ వాడకాన్ని అంచనావేసి ఆన్లైన్లో పొందుపరచాలని అనుకున్నా మార్చి నెల వేసవి కాలం కావటంతో కరెంట్ వినియోగం ఎక్కువ ఉండే అవకాశం ఉన్న నేపధ్యంలో ఆ నిర్ణయం మార్చుకున్నట్టు తెలుస్తుంది . తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈ మేరకు తీసుకున్న నిర్ణయం ప్రకారం గతేడాది మార్చిలో వచ్చిన కరెంట్ బిల్లును, ఈ నెలలో మళ్లీ ఆన్లైన్ ద్వారా చెల్లిస్తే సరిపోతుందని వినియోగదారులకు తెలియజేసింది.
2019 మార్చి బిల్లు కట్టాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వినియోగదారులు
అటు వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలకైతే 2019 మార్చిలో వచ్చిన బిల్లులో సగం అమౌంట్ ఇప్పుడు కడితే సరిపోతుందని తెలిపింది.అయితే అప్పుడు వినియోగానికి, ఇప్పుడు వినియోగానికి ఎలా పొంతన అని కొందరు వినియోగ దారులు మండిపడుతున్నారు. ఒకవేళ అప్పుడు ఏసీలు , ఫ్రిజ్ లు ఉంది ఇప్పుడు లేకపోతే, లేదా ఇప్పుడు విద్యుత్ వినియోగం బాగా పెరిగితే ఒకటే బిల్ ఎలా వస్తుంది అని ప్రశ్నిస్తున్నారు.ఇక గత ఏడాది కరెంట్ మీటర్ లేకుండా, ఈ ఏడాది మీటర్లు కొత్తగా తీసుకున్న వారికి ఎలా చార్జ్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇక గతంలోనే బిల్ ఎక్కువ వచ్చిందని లబోదిబోమన్నవాళ్ళు ఇప్పుడు మళ్ళీ గత ఏడాది మార్చి నెల బిల్లు కట్టమంటే ససేమిరా అంటున్నారు.
లాక్ డౌన్ తరువాత మీటర్ రీడింగ్ ద్వారా సర్దుబాటు చేస్తామంటున్న విద్యుత్ సంస్థలు
అయితే విద్యుత్ సంస్థలు తరువాత మీటర్ రీడింగ్ చూసినప్పుడు ఎక్కువ , తక్కువ చెల్లింపులకు సంబంధించి బిల్లులు సర్దుబాటు చేస్తామని విద్యుత్ సంస్థలు చెప్తున్నా వినియోగదారులు మాత్రం ఇదంతా మోసం అంటున్నారు. అసలే కరోనా ఎఫెక్ట్ తో ఇళ్లకే పరిమితం అయితే ఇప్పుడు కరెంట్ బిల్లుల బాదుడు విషయంలో ప్రభుత్వం ప్రజలకు భారం పడకుండా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. లాక్ డౌన్ ముగిసిన తరువాత ఇంటింటికీ వెళ్లి మీటర్ రీడింగ్ తీసుకుని విద్యుత్ సిబ్బంది బిల్లులు ఇవ్వనున్నారు. ఇప్పుడు మీరు ఆన్లైన్ ద్వారా కట్టిన సొమ్మును అందులో సర్దుబాటు చేస్తారని చెప్తున్నా నమ్మటంలేదు .
Recommended Video
లాక్ డౌన్ సమయంలో కరెంట్ బిల్లులు .. ప్రజల్లో తీవ్ర అసహనం
అయితే లాక్ డౌన్ తర్వాత మీటర్ రీడింగ్ మార్చి 1 నుంచి మే 1 వరకు రెండు నెలలకు ఒకేసారి తీస్తారు కాబట్టి ఎక్కువ యూనిట్లు బిల్లు రావడమే కాకుండా రేట్ కూడా పెరుగుతుందని కొంతమంది విద్యుత్ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. అయితే అలాంటి సమస్యలు రాకుండా రీడింగ్ ఎన్ని రోజుల తర్వాత తీసినా కేవలం 30 రోజులకు మాత్రమే బిల్లు వచ్చేలా సర్వర్లో మార్పులు చేస్తామని దక్షిణ డిస్కం సీఎండీ రఘురాంరెడ్డి తెలిపారు. కానీ ఈ నిర్ణయం వినియోగదారులకు ఏ మాత్రం రుచించటం లేదు. ఏది ఏమైనా బిల్లు వివరాలన్నింటిని కూడా విద్యుత్ పంపిణీ సంస్థలు డైరెక్ట్ మీ ఫోన్లకే ఎస్ఎంఎస్ల ద్వారా పంపిస్తారు. ఇక వీటిని ఆన్ లైన్ లో చెల్లించాలి . లాక్ డౌన్ కారణంగా మీటర్ రీడింగ్ తీసుకునే అవకాశం లేనందున డిస్కంలకు ఈ వెసులుబాటు కల్పిస్తూ టీఎస్ఈఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. ఇక దీంతో ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది.