వామ్మో అవి కుటుంబాలా..? రాజకీయ నేతల తయారీ పరిశ్రమలా..?!!
మొయినాబాద్/హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయ చైతన్యం ఎక్కువైంది. రాజకీయాలు మనకెందుకులే అనుకునే స్థాయి నుంచి రాజకీయాలే జీవిత పరమావదిగా తెలంగాణ సమాజంలో నాటుకుపోయింది. అందుకు ఒకే కుటుంబం నుండి కనీసం ముగ్గురు లేదా నలుగురు వివిధ రాజకీయ పదవుల్లో కొనసాగడమే గట్టి ఉదాహరణ. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కుటుంబాల్లో పదవుల పంట పండింది. ఈ రెండు కుటుంబాల్లోనూ నలుగురు చొప్పున ప్రజాప్రతినిధులుగా ఎన్నికవడం విశేషం. రిజర్వేషన్లు కలిసి రావడంతో.. ఆయా కుటుంబాల్లో ప్రజాప్రతినిధులుగా కొనసాగే అవకాశం చిక్కింది. ప్రస్తుతం ఈ రెండు కుటుంబాల అంశం ఇటు రంగారెడ్డి.. అటు వికారాబాద్ జిల్లాలో చర్చనీయాంశమవుతోంది.
తెలంగాణలో రాజకీయాలపై పెరిగిన ఆసక్తి..! నేతల ఇళ్లల్లో వరిస్తున్న వదవులు..!!
రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డా.పి.మహేందర్రెడ్డి కుటుంబంలో మరొకరికి ప్రజాప్రతినిధిగా అవకాశం లభించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు వరుసగా రెండు సార్లు జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ స్థానాన్ని దక్కించుకున్న ఆయన సతీమణి పట్నం సునీతారెడ్డి.. ఈసారి వికారాబాద్ జిల్లా కోట్పల్లి జడ్పీటీసీగా గెలుపొందారు. హ్యాట్రిక్గా ఛైర్పర్సన్గా ఎన్నికయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎమ్మెల్సీగా కొనసాగిన ఆయన తమ్ముడు పట్నం నరేందర్రెడ్డి కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డిపై గెలుపొందారు.
జడ్పీ వైస్ ఛైర్మన్ కోసం పోటాపోటీ..! పావులు కదుపుతున్న మహేందర్ రెడ్డి..!!
ఖాళీ అయిన తమ్ముని స్థానం నుంచి బరిలో దిగిన మహేందర్రెడ్డి ఎమ్మెల్సీగా విజయ కేతనం ఎగురవేశారు. చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని షాబాద్ మండలం జడ్పీటీసీగా మహేందర్రెడ్డి సోదరుని కుమారుడు, టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పట్నం అవినాష్రెడ్డిని బరిలో దింపి గెలిపించుకున్నారు. ఇలా కుటుంబంలో భార్య, అన్న కొడుకు జడ్పీటీసీలుగా గెలుపొందగా.. తమ్ముడు ఎమ్మెల్యేగా.. తాను ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఇటు మహేందర్రెడ్డి అన్న కొడుకు పట్నం అవినాష్రెడ్డి.. అటు ఎమ్మెల్యే యాదయ్య తనయుడు కాలె శ్రీకాంత్కుమార్.. రంగారెడ్డి జిల్లా పరిషత్ ఉపాధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నారు. జిల్లా పరిషత్ అధ్యక్ష స్థానం జనరల్ మహిళకు రిజర్వు అయినందున.. ఎస్సీ వర్గానికి ఉపాధ్యక్ష పదవి ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. పార్టీ అధిష్ఠానం సైతం ఉపాధ్యక్ష పదవిని ఎస్సీకి ఇవ్వాలని యోచిస్తే.. ఎమ్మెల్యే యాదయ్య తనయునికి ఉపాధ్యక్ష పదవి వరించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఎమ్మెల్యే కుటుంబంలోనూ పదవుల పండగే..! ఇంట్లో నలుగురూ రాజకీయ నేతలే..!!
ఇక మహేందర్రెడ్డి సైతం అవినాష్రెడ్డిని ఉపాధ్యక్షునిగా గెలిపించుకొనేందుకు ఇప్పటికే వ్యూహాలు పన్నుతున్నట్లు.. జడ్పీ ఛైర్మన్ స్థానంలో మహిళకు రిజర్వ్ చేసినందున.. ఉపాధ్యక్ష పదవిలో పురుషులకు అవకాశం ఇవ్వాలని అధిష్ఠానానికి నివేదించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కాలె యాదయ్య కుటుంబంలోనూ అనుకోకుండా పదవులు వరించాయి. వికారాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే నవాబుపేట మండలం జడ్పీటీసీ అభ్యర్థిగా భార్య జయమ్మను, స్వగ్రామం చించల్పేట ప్రాదేశిక నియోజకవర్గం నుంచి రెండో కోడలు కాలె దుర్గాభవానిని పోటీ చేయించారు.
యాదయ్య ఇంట్లో పదవుల పంట..! కుటుంబ సభ్యలందరూ పదవుల్లోనే..!!
ఇటీవల వెలువడిన ఫలితాల్లో అత్తాకోడల్లిద్దరూ గెలుపొందారు. శుక్రవారం జరిగే ఎంపీపీ ఎన్నికల్లో తన కోడలను ఆ స్థానంలో కూర్చొబెట్టేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. ఇక అనుకోని రీతిలో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన పెద్ద తనయుడు కాలె శ్రీకాంత్కుమార్ను ఈసారి మొయినాబాద్ జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీచేయించారు. స్థానికేతరుడిగా మొదట్లో వ్యతిరేకత వచ్చినా.. 2,650 ఓట్ల మెజారిటీతో శ్రీకాంత్కుమార్ విజయం సాధించారు. దీంతో ఎమ్మెల్యే కుటుంబంలో భార్య, కొడుకును జడ్పీటీసీలుగా.. కోడలిని ప్రాదేశిక సభ్యురాలిగా గెలిపించుకున్నారు. ఇలా ఒకే ఇంట్లో నలుగురు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు.