కాంగ్రెస్ వి దుష్టపన్నాగాలు, వీళ్లసలు తెలంగాణ బిడ్డలేనా?: నిప్పులు చెరిగిన కేసీఆర్
కాంగ్రెస్ పార్టీ.. ప్రభుత్వం తలపెట్టిన ప్రతి మంచి పనికీ అడ్డు పడుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మండిపడ్డారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో విచిత్రమైన పరిస్థితిని చూస్తున్నామని వ్యాఖ్యానించ
హైదరాబాద్: అధికారంలోకి వస్తామనుకుని భంగపడ్డ కాంగ్రెస్ పార్టీ.. ప్రభుత్వం తలపెట్టిన ప్రతి మంచి పనికీ అడ్డు పడుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మండిపడ్డారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో విచిత్రమైన పరిస్థితిని చూస్తున్నామని వ్యాఖ్యానించారు.
ప్రాజెక్టులు, ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, ఉద్యోగుల క్రమబద్ధీకరణ.. ఇలా అన్ని విషయాల్లోనూ కోర్టులకు వెళ్లి కాంగ్రెస్ కేసులు వేస్తోందని, విపక్ష పార్టీ తీరుతో అన్ని పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ దుష్టపన్నాగాలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిస్తున్నట్లు చెప్పారు.
మొదలుపెట్టిందే కాంగ్రెస్, పోషించింది చంద్రబాబు...
కాంట్రాక్ట్ ఉద్యోగ వ్యవస్థను కాంగ్రెస్ పార్టీ మొదలుపెడితే, దాన్ని చంద్రబాబునాయుడు కొనసాగించారని, గత ప్రభుత్వాలు కాంట్రాక్ట్ ఉద్యోగులు అర్థాకలితో అలమటించేలా చేశాయని, కాంగ్రెస్ వల్ల లక్ష మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు నానా అగచాట్లు పడ్డారని పేర్కొన్నారు. హైకోర్టు దీనిని కూడా పరిగణనలోనికి తీసుకోవాలని తాను విజప్తి చేస్తున్నానని, ఈ విషయంలో హైకోర్టును కూడా నేను అభినందిస్తున్నాను. అన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, హై స్కిల్డ్ ఉద్యోగులకు కోర్టు కాస్త ఎక్కువ చేయమని చెబుతూ రౌండ్ ఫిగర్ చేసిందని చెప్పారు. ఇది రెగ్యులరైజేషన్ కాదని, ఉద్యోగులను కంపెనీల పరిధిలోకి తీసుకొచ్చామని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు న్యాయం చేయడం కోసమే వారిని కాంట్రాక్ట్ వ్యవస్థ నుంచి తప్పించామని, ఇప్పడు కోర్టు స్టే ఇవ్వడంతో ఏం చేయాలో యోచిస్తామని తెలిపారు.
ఒక్క నీటి పారుదల ప్రాజెక్టులపైనే 164 కేసులు...
చిల్లర రాజకీయాల కోసం కాంగ్రెస్ నేతలు నీచంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. బుధవారం మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతీ పనిని అడ్డుకుంటూపోవడమే లక్ష్యంగా.. కాంగ్రెస్ నేతలు ఇప్పటి వరకు 196 కేసులు వేశారని చెప్పారు. ‘ఒక్క నీటి పారుదల ప్రాజెక్టులపైనే 164 కేసులు వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపైనైతే 20 రోజుల వ్యవధిలో ఆరు కేసులు వేశారు. ఉద్యోగాల నోటిఫికేషన్లపై కేసులు, డిపెండెంట్ ఉద్యోగాలిస్తామంటే కేసులు, విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామంటే కేసులు.. అసలు దేశంలో ఎక్కడా లేని పరిస్థితి తెలంగాణలో నెలకొంది. ఆ పార్టీ వల్ల లక్షల మంది ఉద్యోగులు, కార్మికులు, కార్మికుల కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ శిఖండి పార్టీకి ప్రజలే బుద్ధి చెప్పాలి. ఎక్కడికక్కడ నిలదీయాలి' అని కేసీఆర్ అన్నారు.
హైకోర్టుకు ధన్యవాదాలు...
ట్రాన్స్కో, జెన్కోలతోపాటు రెండు డిస్కంలలో కాంట్రాక్టర్ల కింద పనిచేస్తోన్నవారిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలనే ప్రక్రియపై స్టేను ఎత్తివేసిన హైకోర్టుకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. నిజానికి వారిని క్రమబద్ధీకరించలేదని, కాంట్రాక్టర్ల చెర నుంచి విడిపించి, ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే విధానాన్ని రూపొందించామని వివరించారు. ఈ విషయంలో కోర్టు మానవతా ధృక్ఫథంతో ఆలోచించిందని, ప్రధాన న్యాయమూర్తికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్న సీఎం.. ప్రభుత్వ లాయర్లు అద్భుతంగా వాదించారని కితాబిచ్చారు.
సింగరేణి ఉద్యోగులు సైనికులకంటే తక్కువేం కాదు...
ఎన్నికల హామీ మేరకు సింగరేణిలో వారసత్వం ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ఉత్తర్వులు ఇచ్చినా, కోర్టు ఉత్తర్వుల వల్ల ప్రక్రియ నిలిచిపోయిందని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. అయితే, ప్రక్రియను తిరిగి పునరుద్ధరించేలా సింగరేణి వరకు ప్రత్యేక చట్టం తేవాలా? లేక ఇంకేదైనా ప్రత్యామ్నాయం చూపాలా? అనేదానిపై అధికారులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. నిజానికి బొగ్గుబావుల్లో ఉద్యోగం చేసేవారు.. దేశాన్ని కాపాడే జవాన్లకంటే ఏమాత్రం తక్కువ కాదని, అందుకే వారసత్వ ఉద్యోగాల కల్పనలో వీరిని ప్రత్యేకంగా పరిగణించాలని గతంలో(నాటి ప్రధాని మన్మోహన్కు) లేఖరాసినట్లు కేసీఆర్ చెప్పారు.
గూర్ఖాలాండ్ ఉద్యమానికి మద్దతుపై...
పశ్చిమ బెంగాల్ నుంచి విడదీసి ప్రత్యేక గూర్ఖాల్యాండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ ఉధృతంగా సాగుతోన్న ఉద్యమంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. ప్రస్తుతానికి ప్రత్యేక గూర్ఖాలాండ్ ఉద్యమంపై విధానపరమైన నిర్ణయమేదీ తీసుకోలేదని, అలా తీసుకోలేక పోవడానికి కూడా కారణాలున్నాయని వివరించారు. ‘గూర్ఖాలాండ్ అంతర్జాతీయ సరిహద్దులో ఉంది. ఉన్నట్లుండి ఇప్పుడే ఉద్యమం ఉధృతం కావడం వెనుక చైనా హస్తం ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. గూర్ఖాలాండ్ ఏర్పడితే ఈశాన్య రాష్ట్రాల్లో కల్లోలం చెలరేగే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. ఒకవేళ మా స్టాండ్ చెప్పాల్సి వస్తే పార్టీలో చర్చించి చెబుతాం' అని కేసీఆర్ అన్నారు.
తెలంగాణ అభివృద్ధి ఇష్టం లేదా?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అధికారం ఆశించి భంగపడ్డారన్న ఆయన, కాంగ్రెస్ నేతలు తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పనిచేయలేదని విమర్శించారు. నిత్యం ప్రభుత్వంపై విమర్శలు చేసే ఆ పార్టీ నేతలకు.. టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ప్రతీ దానిని అడ్డుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు కేసుల పురాణం మొదలుపెట్టారని మండిపడ్డారు. నీటి ప్రాజెక్టులు అడ్డుకోవడానికి కేసులు వేశారని, ఉద్యోగాల నోటిఫికేషన్లపైనా కేసులు వేశారని చెబుతూ తెలంగాణ అభివృద్ధి వీరికి ఇష్టం లేదా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఒక్క రోజులో ఆరు కేసులు వేశారన్న ఆయన, వారి దురాలోచనను గ్రహించిన న్యాయస్థానాలు కాంగ్రెస్ నేతలకు మొట్టికాయలు వేశాయన్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న వీళ్లు అసలు తెలంగాణ బిడ్డలేనా? అంటూ నిప్పులు చెరిగారు.
కోర్టు చెప్పినదానికంటే రూ.వెయ్యి ఎక్కువే ఇస్తాం...
సింగరేణిపై కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్లడంతో మేం ఆలోచనలో పడ్డామని, కోర్టు రెగ్యులరైజేషన్ ను అడ్డుకుంటే తాము జీతాలు పెంచుతామని తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేసి, ఏ శాఖలో ఎంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో వివరాలు సేకరించి కోర్టు చెప్పినదానికంటే మరో రూ.వెయ్యి ఎక్కువే ఇస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. కోర్టు రెగ్యులరైజ్ చేయొద్దని చెప్పినా.. ఉద్యోగులకు అన్యాయం చేయమని, తగిన జీతాలు ఇస్తామని చెప్పారు. విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పగలనక, రాత్రనక కష్టపడుతున్నారని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు విద్యుత్ ఎంత అవసరమో 30 ఏళ్లుగా ఎన్నో అగచాట్లు పడ్డామో తెలిసిందేనన్నారు. మేం విద్యుత్ తీసుకొస్తే.. యాదాద్రి, భద్రాద్రి పవర్ స్టేషన్లపైనా కేసులు వేయించారని తెలిపారు.