రెస్టారెంట్లలో కార్డు ద్వారా బిల్లు చెల్లిస్తున్నారా..! ఐతే నిలువుదోపిడి తప్పదు సుమీ..!!
హైదరాబాద్: నగరంలో నోరూరించే రెస్టారెంట్కు వెళ్లి బిర్యానీ తింటున్నారా..? లేదంటే పేరొందిన బార్కు వెళ్లి ఓ పెగ్గు మందు కొడుతున్నారా..? ఆ తర్వాత బిల్లు మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా చెల్లించాలనుకుంటున్నారా..?తస్మాత్ జాగ్రత్త..! అసలు కథ ఇక్కడే మొదలవుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. బిల్లు కట్టే సమయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా, మీ బ్యాంకు ఖాతా గుల్ల కాక తప్పదు. ఎందుకంటే హైదరాబాద్లోని బార్లు, రెస్టారెంట్లలో సైబర్ నేరగాళ్లు అడ్డా వేసినట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. ముఖ్యంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మకాం వేసి డేటా తస్కరణకు పాల్పడుతున్న ముఠా పట్ల చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది.
ఏమరు పాటుగా ఉంటే మీ కార్డ్ క్లోనింగ్ కాక తప్పదు..! ఆ తర్వాత మీ సొమ్ము గయాబ్..!!
సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు కొద్ది రోజుల క్రితం రెస్టారెంట్లు, బార్లలో డెబిట్, క్రెడిట్కార్డులను క్లోనింగ్ చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన సంగతి తెలిసిందే. సుమిత్ జింగ్రాన్, సచిన్కుమార్ (ఉత్తరప్రదేశ్), కెవిన్ జెర్రీ డిసౌజా, రఫీక్ఫారూఖ్ ఖాన్(ముంబయి), గౌరవ్వర్మ(మధ్యప్రదేశ్)తో కూడిన ముఠా ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నట్లు తేలడంతో రఫీక్ మినహా మిగిలిన నలుగురిని అరెస్ట్ చేశారు. సుమిత్ జింగ్రాన్ నేతృత్వంలో ఈ ముఠా సైబరాబాద్, హైదరాబాద్ల్లో పలు నేరాలకు పాల్పడింది.
రెస్టారెంట్లలో తిష్టవేస్తున్న డేటా తస్కరణ గ్యాంగ్..! నమోదౌతున్న కేసులు..!!
రెస్టారెంట్లు, బార్లలో పనిచేసే వెయిటర్లు, స్టివార్డుల్ని మచ్చిక చేసుకొని వారి ద్వారా కార్డుల డేటా సమాచారాన్ని తస్కరించింది. అనంతరం స్కిమ్మింగ్, క్లోనింగ్ ప్రక్రియ ద్వారా నకిలీ కార్డుల్ని సృష్టించి ఏటీఎం లేదా ఆన్లైన్ లావాదేవీల ద్వారా డబ్బు కొట్టేసింది. సైబరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు చేసి ముంబయి నుంచి ముఠా సభ్యుల్ని పట్టుకొచ్చారు. తాజాగా మరో ముఠా పంజా విసురుతున్నట్లు ఫిర్యాదుల ఆధారంగా వెల్లడి కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కూకట్పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లోని రెస్టారెంట్లు, బార్లలో ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నట్లు గుర్తించారు.
బిల్లు 500.. కోల్పోయేది 50 వేలు..! తస్మాత్ జాగ్రత్త..!!
రెస్టారెంట్లు, బార్లకు వచ్చే వినియోగదారుల నుంచి కార్డుల సమాచారాన్ని స్కిమ్మింగ్ ప్రక్రియ ద్వారా సేకరించడమే వీరి పని. ఇందుకోసం వీరికి ఒక్కో కార్డుకు కొంత చొప్పున కమీషన్ అందుతుంది. వీరు చేయాల్సిందల్లా వినియోగదారుడు బిల్లు చెల్లించే సమయంలో కార్డును లోపలికి తీసుకెళ్లి స్వైప్ చేసుకొస్తామని చెప్పడమే. అందుకు వినియోగదారుడు అంగీకరిస్తే చాలు తన పని ప్రారంభిస్తాడు. కార్డు పిన్ నంబరును వినియోగదారుడి నుంచి తెలుసుకొని లోపలికి వెళ్లి బిల్లుకు సంబంధించినంత వరకు స్వైప్ చేస్తాడు. అదే సమయంలో వినియోగదారుడి సెల్ ఫోన్ యథావిధిగా కట్టాల్సిన బిల్లుకు సరపడా డెబిట్ అయినట్లు సంక్షిప్త సమాచారం వస్తుంది కాబట్టి ఏ మాత్రం అనుమానం రాదు.
ద్రుష్టి సారించిన సైబర్క్రైం శాఖ..! ముఠాను పట్టుకుంటామంటున్న పోలీసులు..!
ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అప్పటికే తన దగ్గర ఉన్న స్కిమ్మర్లో ఆ కార్డును మరోసారి స్వైప్ చేస్తాడు. అప్పుడు ఆ కార్డులో నుంచి డబ్బులు బదిలీ కావు కానీ కార్డుకు సంబంధించిన పూర్తి వివరాలు స్కిమ్మర్లో నమోదవుతాయి. దీనికితోడు పిన్ నంబరు తెలుసు కాబట్టి ఆయా వివరాల్ని ప్రధాన నిందితులకు చేరవేస్తాడు. అనంతరం క్లోనింగ్ ప్రక్రియ ద్వారా నకిలీ కార్డును సృష్టించి బాధితుడి డెబిట్, లేదా క్రెడిట్ కార్డులో ఉన్న నగదును స్వాహా చేస్తారు. ఇదే తరహాలో ప్రస్తుతం మరో కొత్త ముఠా నేరాలకు పాల్పడుతుండటంతో వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సైబర్క్రైం పోలీసులు సూచిస్తున్నారు.