టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు ముందు బైఠాయించిన రైతులు..
రైతులకు-వ్యాపారులకు మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడానికి వెళ్లిన ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కు రైతుల నిరసన సెగ తగిలింది.
ఖమ్మం : టీఆర్ఎస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కు రైతుల నిరసన సెగ తగిలింది. వ్యాపారులకు సహకరిస్తూ.. తమ అమ్మకాలను దెబ్బతీస్తున్నారని అజయ్పై రైతులు ఆరోపణలు చేస్తున్నారు. బయటి మార్కెట్లో కూరగాయలను కొనుగోలు చేసి.. వాటిని రైతు బజార్ ఎదుట విక్రయిస్తున్నారని వాపోతున్నారు.
ఇదే విషయమై ప్రస్తుతం రైతులకు-వ్యాపారులకు మధ్య వివాదం నడుస్తోంది. దీన్ని పరిష్కరించడానికి ఎమ్మెల్యే అజయ్ మంగళవారం ఉదయం రైతు బజార్ వద్దకు వచ్చారు. సమస్య పరిష్కారం కోసం వ్యాపారులకు రైతు బజార్లో స్టాల్స్ ఏర్పాటు చేయిస్తామని ఈ సందర్బంగా ఆయన పేర్కొనడం.. రైతులకు ఆగ్రహం తెప్పించింది.
వ్యాపారులకు రైతు బజార్ లో స్టాల్స్ కేటాయించడమేంటి? అని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఆయన కారుకు అడ్డంగా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి.. రైతులకు నచ్చజెప్పడంతో ఎమ్మెల్యే అజయ్ ను అక్కడినుంచి వెళ్లనిచ్చారు.