ట్విస్ట్: షామీర్ పేట చెరువులో పిల్లల్ని చంపి, తాను చనిపోవాలని బతికిన అర్జున్
షామీర్ పేట చెరువులో ఇద్దరు పిల్లల్ని చంపేసిన తండ్రి అర్జున్ బతికే ఉన్నాడుఅతను కూడ ఈ ఘటనలో చనిపోయాడని భావించారు.
షామీర్ పేట: షామీర్ పేట చెరువులో ఇద్దరు పిల్లల్ని చంపి తండ్రి ఆత్మహత్య చేసుకొన్న ఘటన మరో మలుపు తిరిగింది. ఈ కేసులో పిల్లల్ని చంపిన తండ్రి బతికే ఉన్నాడు. పిల్లలతో పాటుగా తండ్రి కూడ చనిపోయాడని భావించారు.అయితే ఈ కేసులో తండ్రి బతికే ఉన్నాడని పోలీసులు గుర్తించారు.
సికింద్రాబాద్ లోని రసూల్ పురా కృష్ణానగర్ కాలనీకి చెందిన కె. అర్జున్, కౌసల్య దంపతులకు కూతురు పూజిత, కుమారుడు ధనుష్ ఉన్నారు. అర్జున్ ఆటో డ్రైవర్ గా కొంతకాలం పనిచేశాడు. ప్రస్తుతం ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. మధ్యాహ్నం కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్ కు వెళ్ళి అటు నుండి స్మిమ్మింగ్ పూల్ కు వెళతానని చెప్పిన అర్జున్ ఇంటి నుండి కూతురు, కుమారుడితో కలిసి తన స్కూటీపై బయలుదేరాడు.
అయితే రాత్రైనా ఇంటికి తిరిగి రాలేదు. మంగళవారం అర్ధరాత్రి గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు షామీర్ పేట చెరువు కట్టపై అర్జున్ ద్విచక్రవాహనం కన్పించింది. దీంతో పోలీసులు ఆ బైక్ డిక్కీ తీయగా ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉంది. ఆ సెల్ ఫోన్ కింద సూసైడ్ నోట్ లభ్యమైంది. పోలీసులు లెటర్ లో ఉన్న నెంబర్ కు సమాచారమిచ్చారు.
అయితే షామీర్ పేట చెరువులో మృతదేహం కన్పించడంతో గజ ఈతగాళ్ళతో గాలించారుర. దీంతో పూజిత శవం దొరికింది. చెరువు తూములో ధనుష్ మృతదేహం లభ్యమైంది. అర్జున్ మృతదేహం కోసం గాలించారు. అయినా ఫలితం లేకపోయింది. వ్యాపార లావాదేవీల్లో భాగస్వామ్యులు మోసం చేసినందుకే అర్జున్ మనస్థాపంతో ఆత్మహత్య చేసుకొన్నాడని అర్జున్ సోదరుడు బంధువులు చెప్పారు.
చావాలనుకొన్నా...బతికాను
చావాలనుకొని బతికిపోయానని ధనుష్, పూజితలను షామీర్ పేట చెరువులో తోసి చంపేసిన అర్జున్ చెబుతున్నారు. ఆయన కూడ చావుబతుకుల మధ్య కొంపల్లిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
పూజిత, ధనుష్ లకు ఈత నేర్పించేందుకు వెళ్తున్నట్టు భార్యకు చెప్పి ద్విచక్రవాహనంపై ఇంటి నుండి బయలుదేరాడు అర్జున్. చెరువులో పిల్లల్ని చంపేశాడు. అయితే చెరువువద్దే స్కూటీని వదిలేశాడు. సూసైడ్ లెటర్ కూడ పెట్టాడు.అయితే అర్జున్ మృతదేహం దొరకలేదు.
దీంతో అర్జున్ బంధుమిత్రులు కృష్ణా, బాబురావు, శ్రీను, రవి తదితరులు సిద్దిపేట వెళ్ళే మార్గంలో అతని కోసం వెతికారు. గురువారం సాయంత్రం వర్గల్ మండలం గౌరారం వద్ద రాజీవ్ రహదారిపై ఉన్న హోట్ లో వారంతా టీ తాగేందుకు తమ వాహనాన్ని ఆపారు. అదే సమయంలో రోడ్డు మీద నడుచుకొటూ వెళ్తున్న అర్జున్ కన్పించాడు.
వెంటనే అతణ్ణి హోటల్లోకి పిలిపించి మాట్లాడారు. పిల్లలను చెరువులోకి తోసేసిన తాను కూడ చావాలనుకొన్నానని కానీ, బతికినట్టు వారికి చెప్పాడు. కొద్దిసేపటికి టాయిలెట్ కు వెళ్ళోస్తానని చెప్పి హోటల్ కు సమీపంలోని వ్యవసాయక్షేత్రంలోని ట్రాన్స్ ఫార్మర్ తీగలను పట్టుకొన్నాడు.
అతనికి విద్యుత్ షాక్ కొట్టింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇది గమనించిన మిత్రులు అతడిని గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత కొంపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను కొంపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు.