28న పెళ్లి: ఇంతలోనే జవాను అనుమానాస్పద మృతి
నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమళ్లకు చెందిన ఆర్మీ జవాన్ అనంతుల లింగస్వామి(28) పశ్చిమబెంగాల్లో ఆదివారం అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. పనానగర్బేస్ క్యాంప్లో విధులు నిర్వహిస్తున్న లింగస్వామి హఠాన్మరణం చెందడంపై తల్లిదండ్రులు, కుటుంబీకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తడకమళ్లకు చెందిన అనంతుల వెంకయ్య, లక్ష్మమ్మ దంపతులకు ఐదుగురు కూతుళ్లు, లింగస్వామి ఏకైక మగ సంతానం. ఎనిమిదేండ్ల కిందట సైన్యంలో చేరిన లింగస్వామి ప్రస్తుతం పశ్చిమబెంగాల్లో విధుల్లో ఉన్నాడు. పదిరోజల కిందటే స్వగ్రామం లో లింగస్వామికి నిశ్చితార్థం జరిగింది. ఈనెల 28న వివాహం జరగాల్సి ఉంది. సెలవులకు అనుమతి తీసుకునేందుకు పెండ్లికార్డులు తీసుకుని గతనెల 30న ఇంటి నుంచి బయల్దేరాడు.
లింగస్వామి మృతిచెందాడని ఆర్మీ అధికారులు ఉదయమే ఫోన్ చేసి చెప్పారని కుటుంబసభ్యులు తెలిపారు. గుండెనొప్పితో మృతిచెంది ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేశారని వెల్లడించారు. శనివారం రాత్రి కూడా ఫోన్లో మాట్లాడిన కుమారుడు ఉన్నట్టుండి చనిపోవడంపై తల్లిదండ్రు లు అనుమానాలు వ్యక్తంచేశారు.
లింగస్వామి మృతితో తడకమళ్లలో విషాదఛాయలు నెలకొన్నాయి. లింగస్వామి మృతదేహం సోమవారం సాయంత్రం స్వగ్రామానికి చేరే అవకాశాలున్నట్లు తెలిసింది.