విధి విధానాలే ఖరారు గానీ మోదీకేర్?: ఆరోగ్య శ్రీ పరిమితి రూ.5 లక్షలు
హైదరాబాద్: పేదల కోసం ప్రపంచంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం అమలు తీరుకు విధి విధానాలు రూపొందించనే లేదు. కానీ అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో అమలు చేసిన 'ఒబామా కేర్' తరహాలో ఇది 'మోదీ కేర్' అని భారీగా ప్రచారం మొదలు పెట్టింది. 10 కోట్ల కుటుంబాలకు దీనివల్ల ప్రయోజనం కలుగుతుంది. ఆసుపత్రుల్లో చికిత్సల కోసం ఆస్తులను తెగనమ్ముకోవాల్సిన పరిస్థితిని నివారించడమే దీని ఉద్దేశం.
Recommended Video
పూర్తిగా నగదు రహిత పథకం ఇది. కేంద్రం 'జాతీయ ఆరోగ్య భద్రత పథకం' ప్రకటించడంతో తెలంగాణలోనూ ఆరోగ్యశ్రీ చికిత్సల పరిమితి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెరగనుందా అనే చర్చ మొదలైంది. రాష్ట్రంలో ఈ పథకం కింద సుమారు 77.19 లక్షల నిరుపేద కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. వైద్య చికిత్సకు ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.2 లక్షల గరిష్ఠ పరిమితి ఉంది. దీన్ని రూ.5 లక్షలకు పెంచితే నిరుపేదలకు ప్రయోజనమే.
నియంత్రణ లేకపోతే కార్పొరేట్, ప్రైవేట్ దవాఖానలకే అనుకూలం
ఆరోగ్యశ్రీ ప్రారంభమైన తర్వాత ఈ తొమ్మిదేళ్లలో రూ.2 లక్షల పరిమితి సరిపోక అదనపు నిధులకు అనుమతులివ్వాలని కోరిన కేసులు 100 కూడా ఉండవని ఆరోగ్యశ్రీ అధికారులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో పరిమితి పెంచితే ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు అనుకూలంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సరైన నియంత్రణ లేకపోతే అడ్డగోలు చికిత్సల పేరిట దోచుకోవడానికి ఆసుపత్రులకు అవకాశమిచ్చినట్లు అవుతుందని కొందరు అధికారులు చెబుతున్నారు.
ఈ పథకం పేదలందరికా? అసంఘటిత కార్మికులకేనా?
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన (ఆర్ఎస్బీవై) కింద అసంఘటిత కార్మికులకు ఒక్కో కుటుంబానికి ఏడాదికి గరిష్ఠంగా రూ.30 వేల వరకూ ఆరోగ్య బీమా అందజేస్తోంది. తెలంగాణలో ఇలాంటి అసంఘటిత కార్మికులు సుమారు 20 లక్షల మంది వరకూ ఉంటారని అంచనా. అయితే వీరిలో 95 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చేవారే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన పథకం కేవలం అసంఘటిత కార్మికులకేనా? మొత్తం పేదలందరికా అనేది స్పష్టత లేదు. అసంఘటిత కార్మికులకే అయితే ఆ మేరకు కేంద్రం నుంచి నిధులొస్తాయి. రాష్ట్రానికి ఆర్థిక భారం తగ్గుతుంది.
ఆరోగ్య శ్రీ నిధులు కేటాయిస్తే సరిపోతుందా?
ఈ పథకం మొత్తం 77.19 లక్షల కుటుంబాలకు వర్తిస్తే కేంద్రం పూర్తి నిధులిస్తుందా? కేంద్ర, రాష్ట్ర వాటాలుగా 60: 40 నిష్పత్తిలో ఇస్తుందా? అనేది తేలాల్సి ఉంది. వైద్య చికిత్సల పరిమితి రూ.5 లక్షలకు పెరుగుతుంది కాబట్టి చికిత్స వ్యయం కూడా పెరిగిపోతుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.700 కోట్ల వరకూ ఇప్పుడు ఖర్చుపెడుతున్నంత తన వాటాగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఆరోగ్య శ్రీ పథకం పరిమితి పెంపుపై కేంద్రం నుంచి స్పష్టమైన విధి విధానాలు విడుదలయ్యే వరకు ఈ పథకం గురించి ఏమీ స్పష్టంగా చెప్పలేమని అధికారులు అంటున్నారు.
విధి విధానాలపై అధికారులకు కొరవడిన స్పష్టత
‘మోదీకేర్'గా వ్యవహరిస్తున్న ఎన్హెచ్పీఎస్ పథకం అమలుకు 2018-19లో ఈ పథకం కోసం తాత్కాలికంగా రూ.2000 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ అధికారి ఎ.ఎన్.ఝా మీడియాకు తెలిపారు. దీని తీరుతెన్నులపై పూర్తిస్థాయిలో కసరత్తు చేశాక, తదుపరి కేటాయింపులు జరుగుతాయన్నారు. ‘ఇది నగదు రహిత పథకం. ప్రస్తుతం ఉన్న ఆర్ఎస్బీవైను పునర్వ్యవస్థీకరించి దీన్ని తెస్తున్నాం. ఈ పథకం నిర్వహణ కోసం వివిధ నమూనాలను పరిశీలిస్తున్నాం. ట్రస్టు నమూనాలో నడపాలా? బీమా నమూనాలో నిర్వహించాలా అన్నది పరిశీలిస్తున్నాం' అని చెప్పారు.
ఆరోగ్య బీమా పథకానికి ఏప్రిల్ నుంచి అందుబాటులో నిధులు 24 మెడికల్ కాలేజీల ఏర్పాటుతో అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం మాటేమిటి?
మోదీకేర్ పథకాన్ని ఎప్పటి నుంచి ఆరంభిస్తారన్నది కేంద్ర ఆర్థికశాఖ అధికారి ఎ.ఎన్.ఝా నిర్దిష్టంగా వెల్లడించలేదు. ఏప్రిల్ 1 నుంచి నిధులు అందుబాటులో ఉంటాయన్నారు. నాణ్యమైన వైద్య విద్య, ఆరోగ్య పరిరక్షణ లభ్యతను పెంచేందుకు దేశంలో ప్రస్తుతమున్న జిల్లా ఆసుపత్రుల స్థాయిని పెంచడం ద్వారా కొత్తగా 24 ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామన్న ప్రకటన ప్రకారం దేశంలోని 500కి పైగా జిల్లాల్లోని జిల్లా కేంద్ర ఆసుపత్రుల నవీకరణకు ఎంత కాలం పడుతుందో కేంద్రమే సెలవియ్యాలి. ఇందులోనే ప్రతి రాష్ట్రంలోనూ మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఒకటి చొప్పున మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామంటూనే రాష్ట్రానికి కనీసం ఒక్కటైనా ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రతిపాదనల్లో చెప్పారు. దేశంలో 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయన్న సంగతి తెలియదని భావించలేం. అటువంటప్పుడు 24 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, కనీసం రాష్ట్రానికి ఒకటి అని ప్రతిపాదించడంలో పరమార్థమేమిటో తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.