టార్గెట్ 300 మావోయిస్ట్... ఉత్కంఠగా సెర్చ్ ఆపరేషన్... అడవిలో అసలేం జరుగుతోంది...
గత కొన్ని రోజులుగా మావోయిస్టుల వార్తలు తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మొదట్లో మావోయిస్టు అగ్ర నేత గణపతి లొంగిపోతున్నారంటూ ప్రచారం జరగ్గా... ఆ తర్వాత మావోయిస్టు వర్గాలు దాన్ని ఖండించాయి. ఇదే క్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ పర్యటనకు కూడా వెళ్లి వచ్చారు. ఇటీవలే కదంబా అడవుల్లో ఓ ఎన్కౌంటర్ కూడా చోటు చేసుకోగా... ఇద్దరు మావోలు మృతి చెందారు. తెలంగాణ పోలీస్ వర్గాలు గత కొద్దిరోజులుగా మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్ కోసం చేస్తున్న హంట్ ఆపరేషన్లో భాగంగానే ఈ పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణలోకి చొరబడేందుకు యత్నిస్తున్న మావో దళాలను సీఆర్పీఎఫ్,కోబ్రా, గ్రేహౌండ్స్ దళాలు వెంటాడుతున్నాయి.
మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు కట్టుకథేనా?: మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన
300 మంది మావోలు....
ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణలోకి చొరబడేందుకు దాదాపు 300 మంది మావోయిస్టులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సీఆర్పీఎఫ్, కోబ్రా, గ్రేహౌండ్స్ దళాలు అనుక్షణం అడవిని జల్లెడ పట్టే పనిలో నిమగ్నమయ్యాయి. మావో దళాలు తెలంగాణలోకి వస్తే భారీ దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారంతో అడవిపై నిఘా పెరిగింది. అత్యాధునిక డ్రోన్ కెమెరాలను ఉపయోగించి అడవిలో మావోయిస్టుల జాడను కనిపెట్టేందుకు సీఆర్పీఎఫ్, కోబ్రా, గ్రేహౌండ్స్ దళాలు ప్రయత్నిస్తున్నాయి.
అక్కడే కట్టడి చేసే ప్రయత్నాలు...
మావోయిస్టులు తెలంగాణలోకి చొరబడకుండా బ్రేక్ వేసేందుకు సీఆర్పీఎఫ్, కోబ్రా, గ్రేహౌండ్స్ దళాలు పక్కా ప్లాన్తో ముందుకు సాగుతున్నాయి. తెలంగాణ నుంచి దాదాపు 50 కి.మీ.దూరం ఉన్న ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లా ఇంజారం గ్రామం వద్దే మావోలను కట్టడి చేయాలని భావిస్తున్నాయి. ఇప్పటికే డ్రోన్ కెమెరాలతో అక్కడి మైదానాలు, వాగులు, వంకలపై నిఘా పెంచినట్లు తెలుస్తోంది. సీఆర్పీఎఫ్ ఉపయోగిస్తున్న డ్రోన్ కెమెరాలు భూమిపై చీమ కదలికను సైతం గుర్తించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. భూమి నుంచి కొన్ని వేల కి.మీ ఎత్తున ఎగిరే వీటిని గుర్తించడం మావోయిస్టులకు సాధ్యం కాదు.
నిరంతర కూంబింగ్...
ఈ నెల 13న దాదాపు 300 మంది మావోయిస్టుల కదలికలు సుకుమా జిల్లా కిష్టారం వద్ద సీఆర్పీఎఫ్ డ్రోన్ కెమెరాలకు చిక్కాయి. స్థానికంగా ఉన్న ఓ వాగును దాటుతుండగా కెమెరాల్లో వారి కదలికలు రికార్డయ్యాయి. సమీపంలోని సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడి చేసేందుకే భారీ స్థాయిలో మావో దళాలు అక్కడికి తరలి వెళ్లినట్లు గుర్తించారు. సుకుమా జిల్లాలోని ఇంజారం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు ద్వారా తెలంగాణలోకి చొరబడేందుకు మావోలు ప్రయత్నిస్తున్నట్లు సీఆర్పీఎఫ్ బలగాలు గుర్తించాయి. వారిని తెలంగాణలో అడుగుపెట్టనివ్వకుండా దండకారణ్యం వైపు తరిమికొట్టాయి. అయితే మావోలు మళ్లీ వెనక్కి వచ్చే అవకాశం ఉండటంతో... వారిని సాధ్యమైనంత దూరం తరిమికొట్టేందుకు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి.
Recommended Video
భాస్కర్ దళం కలకలం...
ఇటు ఛత్తీస్గఢ్ నుంచి మావోల చొరబాటు కలకలం రేపుతుంటే... మరోవైపు ఆసిఫాబాద్ అడవుల్లో భాస్కర్ దళం కలకలం రేపుతోంది. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెళ్లు అలియాస్ భాస్కర్ కొన్నాళ్లుగా ఇక్కడి అడవుల్లోనే సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవలి కదంబా ఎన్కౌంటర్లో భాస్కర్ తృటిలో తప్పించుకున్నాడు. దీంతో ప్రస్తుతం అక్కడ పెద్ద ఎత్తున కూంబింగ్ జరుగుతోంది. సివిల్, స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్ దళాలు ఇందులో పాల్గొంటున్నాయి. స్థానికంగా కొత్తవారిని రిక్రూట్ చేసుకునేందుకు గత కొంతకాలంగా భాస్కర్ ఆసిఫాబాద్ అడవుల్లో సంచరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.