తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మపై అరెస్టు వారెంట్ జారీ చేసిన చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్
హైదరాబాద్: తాము ఆదేశించినా విచారణకు హాజరు కాకపోవటంపై ఆగ్రహించిన చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డిలపై బుధవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
హైదరాబాద్ శేరిలింగంపల్లి మండలంలోని రాజేంద్రరెడ్డి నగర్లో 19 ఎకరాల లేఔట్లో పార్కులు, ప్రజావసరాల కోసం వదిలిన స్థలంలో నిర్మాణాలను నిలిపేయాలని కోరుతూ ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఎన్జీటీలో వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణ జరిపిన ట్రిబ్యునల్ అక్కడ ఎలాంటి నిర్మాణాలు జరగకుండా చూడాలని, దీనిపై స్థాయీ నివేదికను సమర్పించాలని సీఎస్, జీహెచ్ఎంసీ కమిషనర్లకు ట్రిబ్యునల్ ఆదేశించింది.
అయితే, ఎన్నికల జరుగుతున్న తరుణంలో విచారణకు స్వయంగా హాజరు కాలేకపోతున్నామని ఈ ఇద్దరు అధికారుల తరఫు న్యాయవాది ట్రిబ్యునల్కు నివేదించారు. జనవరి 21 నాటికి కూడా అక్కడ నిర్మాణాలు కొనసాగుతున్నాయని పిటిషనర్ ట్రిబ్యునల్కు వివరించారు. దీంతో అధికారులపై ట్రిబ్యునల్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
తమ ఉత్తర్వులు అంటే చులకనగా ఉన్నట్లుందని వ్యాఖ్యానిస్తూ జనవరి 27న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. లేని పక్షంలో తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించింది. ఐనా కూడా బుధవారం ఈ అధికారులిద్దరూ హాజరుకాకపోవటంతో ఎన్జీటీ చెన్నై బెంచ్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.