తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి నిమ్స్ ఘనత: యువకుడికి కృత్రిమ కపాలం
హైదరాబాద్: నిమ్స్ వైద్యులు అరుదైన ఘనత సాధించారు. తలకు గాయమై సొట్టబడిన కపాలాన్ని కృత్రిమ పద్ధతిలో తిరిగి యథాస్థితికి తీసుకు వచ్చారు. పాలీ ఇథైల్ ఈధర్ కీటోన్ (పీక్) అనే లోహంతో తయారు చేసిన కృత్రిమ కపాల భాగాన్ని ఉపయోగించి యువకుడి తల ఆకారాన్ని సరి చేశారు.
న్యూరో విభాగం యూనిట్-3 విభాగాధిపతి డాక్టర్ విజయసారథి ఆధ్వర్యంలో వైద్యులు రాజేష్, తిరుమల్, నరేష్, ధీరజ్, వంశీ ఆపరేషన్ నిర్వహించారు.
ఇప్పటి వరకు ప్రమాదవశాత్తు కపాలానికి సొట్ట పడితే పక్క టెముకలు, బ్రెయిన్ సిమెంట్ వాడి సొట్ట భాగాన్ని సరిచేస్తున్నారని, దీంతో ఇతర సమస్యలు తలెత్తుతున్నాయని, పీక్ సాంకేతికతతో తయారు చేసిన భాగాలతో ఎలాంటి సమస్యలూ ఉండవని వైద్యులు చెప్పారు.
భారరహితంతోపాటు ఇది అత్యంత గట్టిగా ఉంటుందని, శరీరంలో చక్కగా ఇమిడిపోతుందని, పుర్రె పైన సంక్షిష్ట గతుకులు ఉండవని, తిరిగి సహజమైన పుర్రె ఆకృతి వస్తుందని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ తరహా శస్త్ర చికిత్స చేయడం ఇదే తొలిసారి అని వైద్యులు చెప్పారు.
హైదరాబాద్ గోల్కొండకు చెందిన ఇరవై అయిదేళ్ల దీపక్ ఏసీలు బాగు చేస్తుంటాడు. ఓసారి ఏసీ మరమ్మతు చేస్తుండగా కాలుజారి కిందపడ్డాడు. తలకు రెండు ప్రాంతాల్లో బలమైన గాయాలయ్యాయి. నిమ్స్కు తరలించగా పదిహేను రోజులపాటు కోమాలో ఉన్నాడు.
మెదడులోని పలు ప్రాంతాల్లో రక్తం గడ్డకట్టింది. వైద్యులు శ్రమించి శస్త్ర చికిత్సలు చేసి అతని ప్రాణాలు కాపాడారు. శస్త్ర చికిత్సలో భాగంగా రెండు చోట్ల పుర్రె ఎముకలను తొలగించారు. పూర్తిగా కోలుకున్నప్పటికీ ఎముకలు తీసివేసిన ప్రాంతంలో పుర్రె సొట్టపడి చర్మం లోపలకు పోయింది.
మెదడు పైన ఒత్తిడి పెరగడంతో పలు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో యువకుడి నుంచి పక్క టెములను సేకరించి తలకు ఒకవైపు కపాలానికి జత చేశారు. కుడివైపు మాత్రం సొట్ట పెద్దదిగా ఉండటంతో ఈ పద్ధతిలో కుదరలేదు. దీంతో పీక్ విధానంతో సరి చేశారు.
ఇది ఖర్చుతో కూడుకున్నది. మంత్రి లక్ష్మారెడ్డి ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్లగా... సానుకూలంగా స్పందించారు. సీఎం తన సహాయ నిధి నుంచి రూ.5 లక్షలు మంజూరు చేశారు. వైద్యులు యువకుడి కపాలాన్ని సిటీ స్కాన్ చేసి 3డీ యానిమేషన్లో పుర్రెను రూపొందించి స్విట్జర్లాండ్లోని కృత్రిమ అవయవాలు తయారు చేసే డిపైసింథసిస్ కంపెనీకు పంపారు.
అక్కడ యువకుడి కపాలానికి సరి సమానమైన పుర్రె భాగాన్ని తయారు చేసి తిరిగి నిమ్స్కు పంపారు. ఆగస్టు 30న వైద్యులు రెండుగంటలపాటు శస్త్ర చికిత్స చేసి యువకుడికి ఆ భాగాన్ని విజయవంతంగా అమర్చారు. అతను కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలి శస్త్ర చికిత్స కావడం గమనార్హం.