మారుతీరావు ఇంట్లో సోదాలు, ప్రణయ్ కేసులో నేతలకు ఆర్యవైశ్య సంఘం వార్నింగ్
మిర్యాలగూడ: ప్రణయ్ హత్య కేసు విచారణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అమృత తండ్రి మారుతీరావు, ఆమె బాబాయి శ్రవణ్ల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ప్రణయ్ హత్య కేసులో నిందితులను పోలీసులు ఈ నెల 5వ తేదీ వరకు తమ కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు.
ఇందులో భాగంగా ప్రధాన నిందితులైన మారుతీ రావు, అతని సోదరుడు శ్రవణ్ కుమార్లను పోలీస్ బందోబస్తు నడుమ మంగళవారం మిర్యాలగూడకు తీసుకు వచ్చారు. డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ బృందాలు ఇరువురి ఇళ్ల తాళాలను తెరిపించి తనిఖీలు జరిపాయని తెలుస్తోంది.
అమృత వద్దకు నేతల క్యూ, ఆఫర్లు: ఏం సహకారం కావాలని కలెక్టర్ అడగ్గా..
మారుతీ రావు ఇంట్లో సోదాలు
ఈ సందర్భంగా కేసుకు సంబంధించి పలు ఆధారాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. వాటితో పాటు కొన్ని విలువైన పత్రాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. సోదాలు ముగిసిన తర్వాత తిరిగి వారిని నల్గొండకు తరలించారు.
రెండు కుటుంబాల మధ్య జరిగిన దుర్ఘటన
ఇదిలా ఉండగా, ప్రణయ్ హత్య తర్వాత కొందరు తమపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు రామకృష్ణ చెన్నైలో అన్నారు. రెండు కుటుంబాల మధ్య జరిగిన దుర్ఘటనను రాజకీయం చేయడం ఏమాత్రం సరికాదని వ్యాఖ్యానించారు. తాము మారుతీ రావును సమర్థించడం లేదని చెప్పారు.
మారుతీ రావుకు మద్దతివ్వడం లేదు
మారుతీ రావు, ఆయన భార్య ప్రపంచ ఆర్య వైశ్య సంఘంలో సభ్యులుగా ఉన్నారని రామకృష్ణ తెలిపారు. అయినప్పటికీ తాము మిర్యాలగూడ ఘటనపై మారుతీ రావుకు మద్దతు ఇవ్వడం లేదని చెప్పారు. కొందరు నాయకులు, రాజకీయ నాయకులు మారుతీ రావు నెపంతో తమ కులాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని, దయచేసి ఏ కులాన్ని నిందించవద్దని విజ్ఞప్తి చేశారు.
ఆర్యవైశ్యులకు వ్యతిరేకంగా ప్రకటన చేస్తే తిరగబడతామని హెచ్చరిక
దమ్ముంటే రెండు కుటుంబాలను కలపాలని, లేదంటే రాజకీయాలు చేయకుంటా వెనక్కి తప్పుకోవాలని రామకృష్ణ హితవు పలికారు. ఆర్యవైశ్యులకు వ్యతిరేకంగా ఏ నేత అయినా ప్రకటన చేస్తే తిరగబడతామని హెచ్చరించారు. ఎవరైనా తమకు వ్యతిరేకంగా మాట్లాడితే వారికి వ్యతిరేకంగా ఓటేయాలని ప్రచారం చేస్తామని హెచ్చరించారు.