రజనీకాంత్ సినిమాల్లోనే ఇలాంటి ఎన్కౌంటర్లు: ఓవైసీ
హైదరాబాద్: ప్రముఖ నటుడు రజనీకాంత్ సినిమాల్లోనే వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్న ఎన్కౌంటర్ లాంటి ఘటనలు ఉంటాయని ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపి అసదుద్దీన్ అన్నారు. ఉగ్రవాదులకు చేతులకు సంకెళ్లు ఉండగా పోలీసుల నుంచి రైఫిళ్లు ఎలా లాక్కుంటారని ప్రశ్నించిన ఆయన ఇలాంటివి రిజినీకాంత్ సినిమాలో మాత్రమే సాధ్యమని తెలిపారు. ఆయన వరంగల్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ విషయమై పలువురు ముస్లిం పెద్దలతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును గురువారం కలిశారు.
ఈ సందర్భంగా వరంగల్ ఎన్కౌంటర్పై సిబిఐ విచారణ చేయాల్సిందిగా సిఎం కెసిఆర్ను అసదుద్దీన్ కోరారు. కొంత సమయమిస్తే విచారణకు ఆదేశిస్తామని సిఎం తెలిపినట్లు ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సిఎం కెసిఆర్పై ముస్లింలకు ఎన్నో ఆశలున్నాయని తెలిపారు.
ఎన్కౌంటర్పై జరిగిన సమయంలో 17మంది పోలీసులున్నారని చెప్పారు. ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. ఈ ఎన్కౌంటర్పై తమకు అనుమానాలున్నాయని, నివృత్తి చేయాలని కోరినట్లు తెలిపారు. ఈ ఎన్కౌంటర్ జరగాల్సింది కాదని అన్నారు. కాగా, కాల్పుల ఘటన దురదృష్టకరమని సిఎం తమతో చెప్పినట్లు ఓవైసీ తెలిపారు.
ఇది ఇలా ఉండగా సిమి ఉగ్రవాది వికారుద్దీన్ తోపాటు ఐదుగురు పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఎన్కౌంటర్పై అసదుద్దీన్ ఇంతకుముందే తీవ్రంగా స్పందించారు. నల్గొండ జిల్లాలో పోలీసుల మీద జరిగిన కాల్పులకు ప్రతీకారంగానే వికారుద్దీన్ను బూటకపు ఎన్కౌంటర్లో హతమార్చారని కూడా విమర్శించారు.
భూసేకరణకు తెరాస మద్దతు దారుణం
భూసేకరణ బిల్లుకు తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతు తెలపడం దారుణమని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ సర్కారు రాష్ట్రంలో 700 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని దుయ్యబట్టారు.
ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ సీనియర్ ఎంపి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోమటి రెడ్డి పెద్ద ఫూల్ అని, అతడ్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.