హజ్ సబ్సిడీపై కేంద్రం సంచలన నిర్ణయం: అసదుద్దీన్ ఓవైసీ స్పందన
హైదరాబాద్: హజ్ యాత్రికులకు రాయితీ రద్దుపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ప్రభుత్వం చేసిన పనిని 2006లోనే చేయాలని తాను చెప్పానని గుర్తు చేశారు. అప్పట్లోనే హజ్ సబ్సిడీ సొమ్మును ముస్లీం చిన్నారుల విద్యకు వెచ్చించాలని కోరినట్లు చెప్పారు.
ముఖ్యంగా బాలికల విద్యకు ఆ సొమ్మును కేటాయించాలని సూచించానని చెప్పారు. దీని గురించి పెద్దగా డప్పు కొట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. 2012లోనే దీనిపై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. అయితే, అన్ని మతాల యాత్రలకు సబ్సిడీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
హిందువుల సబ్సిడీ మాటేమిటని ప్రశ్నించారు. వారికీ తీసేయగలరా అని సవాల్ విసిరారు. కేవలం ముస్లీంలనే లక్ష్యంగా చేసుకొని ఓటు బ్యాంకు రాజకీయాలు చేయవద్దని చెప్పారు. అలాగే ఈసారి బడ్జెట్లో ముస్లీంల అభివృద్ధికి రూ.2వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
కాగా, కేంద్రం గురువారం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. హజ్ యాత్రికులకు ఇచ్చే రాయితీని ఉపసంహరించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మంగళవారం వెల్లడించారు.
ఆ రాయితీ నగదును మైనార్టీల సంక్షేమానికి ఉపయోగించనున్నట్లు తెలిపారు. భారత్ నుంచి మొదటిసారిగా ఈ ఏడాది 1.75లక్షల మంది యాత్రికులు ఎటువంటి రాయితీ లేకుండా హజ్ యాత్రకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. గతేడాది 1.25లక్షల మంది యాత్రికులు హజ్ వెళ్లారు. రాయితీని ఉపసంహరించుకోవడం వల్ల ప్రభుత్వానికి రూ.700కోట్లు ఆదా అవుతుందని, ఈ రాయితీ మొత్తాన్ని ముస్లిం బాలికల విద్యకు ఉపయోగించనున్నట్టు తెలిపారు.
సముద్ర మార్గం ద్వారా కూడా యాత్రికులు హజ్ చేరుకునేందుకు సౌదీ ప్రభుత్వం అంగీకరించిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ రాయితీ వల్ల ముస్లిం ప్రజలకు ఎటువంటి ప్రయోజనం చేకూరడం లేదన్నారు.