కేసీఆర్ సర్కారుకు హైకోర్టు మొట్టికాయలు తప్పవు: అశ్వత్థామ రెడ్డి
హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆర్టీసీ సమ్మెపై సంస్థ ఇంఛార్జీ ఎండీ సునీల్ శర్మ హైకోర్టులో దాఖలు చేసిన తుది అఫిడవిట్ పై స్పందిస్తూ.. అసలు ఆర్టీసీ గురించి సునీల్ శర్మకు ఏం తెలుసని ప్రశ్నించారు.
అదో ఫొలిటికల్ అఫిడవిట్..
ముఖ్యమంత్రి కేసీఆర్ అఫిడవిట్ తయారుచేసి ఇస్తే.. సునీల్ శర్మ సంతకం పెడుతున్నారని.. ఇదంతా ఓ పొలిటికల్ అఫిడవిట్ అని అశ్వత్థామరెడ్డి విమర్శించారు. సునీల్ శర్మ బాధ్యతలు చేపట్టి కేవలం 17 నెలలు మాత్రమే అయ్యిందని, కనీసం 7సార్లు కూడా ఆఫీసుకు రాలేదని అన్నారు.
సమ్మె వల్ల కాదు..
ఆర్టీసీ కార్యాలయంలో పెండింగ్ ఫైల్స్ కుప్పలుతెప్పలుగా పేరుకుపోయాయని అన్నారు. ఆర్టీసీ సమ్మె వల్లే సంస్థ నష్టపోయిందనడం సరికాదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ విధానాలే సంస్థ నష్టాలకు కారణమని అన్నారు. సమ్మె చట్టబద్దమా లేదా అన్నది హైకోర్టు తేలుస్తుందని అశ్వత్థామ రెడ్డి వ్యాఖ్యానించారు.
కేసీఆర్ సర్కారుకు మొట్టికాయలు..
సోమవారం హైకోర్టులో సమ్మె అంశం తేలుతుందని, ప్రభుత్వానికి మరోసారి మొట్టికాయలు పడటం ఖాయమని అశ్వత్థామ రెడ్డి అన్నారు. సమ్మెపై విచారణ జరుపుతున్న సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందన్నారు. సమ్మె అనేది లీగల్ అని.. 14 రోజుల ముందే నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. ఎస్మాకు భయపడేది లేదన్నారు.
భయపడాల్సిన అవసరం లేదు..
అన్నీ తప్పుడు లెక్కలు.. ఎన్ని అఫిడవిట్లు దాఖలు చేస్తారు.. ఇలాంటి వాటికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. విలీనం డిమాండ్ ను తాము తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం జరిగిందని గుర్తు చేశారు. చర్చలు జరిపే ప్రసక్తే లేదని, సమ్మె చట్ట విరుద్ధంగా ప్రకటించాలంటూ నవంబర్ 16న తెలంగాణ ప్రభుత్వం ఫైనల్ అఫిడవిట్ దాఖలు చేసింది. కాగా, నెల రోజులకుపైగా తమ డిమాండ్ల కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ మాత్రం కార్మికుల డిమాండ్లను తీర్చేది లేదని, సమ్మె చట్ట విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రైవేటు వ్యక్తులతో కొన్ని బస్సులను నడుపుతున్నప్పటికీ.. ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు మాత్రం అందడం లేదు.