TSRTC Strike: హైకోర్టు నిర్ణయం మాకు ఓకే: సీఎం కేసీఆర్కు అశ్వత్థామ రెడ్డి కీలక సూచనలు
హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వాత్థామ రెడ్డి స్పందించారు. సమ్మె విషయంలో హైకోర్టు నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని తెలిపారు. ఆర్టీసీ సమ్మెపై విచారణ బుధవారానికి వాయిదా పడిన తర్వాత అశ్వత్థామ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఎర్రబెల్లి నోటి దురద..!ఆర్టీసి సమ్మె పై అనుచిత వ్యాఖ్యలు..!మండిపడుతున్న కార్మికులు..!!
భేషజాలు వద్దు..
తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల విషయంలో భేషజాలకు పోకుండా ఉండాలని ఆయన సూచించారు. ఇప్పటికైనా కోర్టు సూచన మేరకు కమిటీ వేసి సమస్యల పరిష్కారానికి తెలంగాణ సర్కారు కృషి చేయాలని అశ్వత్థామ రెడ్డి కోరారు.
సుప్రీం మాజీ న్యాయమూర్తులతో..
కోర్టులో ఇరుపక్షాల వాదనల తర్వాత ముగ్గురు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తులతో కమిటీ వేయాలని హైకోర్టు సూచించిందని తెలిపారు. దీనిపై ప్రభుత్వంతో మాట్లాడి బుధవారం మధ్యాహ్నంలోపు కమిటీ ఏర్పాటుపై అభిప్రాయం వెల్లడిస్తామని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారని చెప్పారు.
హైకోర్టు చెప్పినట్లు..
తాము కూడా ముఖ్యమంత్రిని అదే కోరుతున్నామని అశ్వత్థామ రెడ్డి తెలిపారు. కమిటీ వేసి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నించాలని కోరారు. ఎలాంటి భేషజాలకు పోకుండా వెంటనే కమిటీ ఏర్పాటు చేయడంతోపాటు హైకోర్టు సూచన మేరకు చర్చల ప్రక్రియ ప్రారంభించాలని కోరతున్నామని చెప్పారు.
మేము సిద్ధమే..
ప్రభుత్వం కమిటీ వేస్తే చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు.కోర్టు ఆదేశాలు, కమిటీ నిర్ణయం తమకు సమ్మతమేనని ఆయన వ్యాఖ్యానించారు. కమిటీకి కూడా కాలపరిమితి ఉంటుందని అశ్వత్థామ రెడ్డి తెలిపారు.సమ్మె చట్ట విరుద్ధమని చెప్పడానికి వీల్లేదని కోర్టు తెలిపిందని ఆయన తెలిపారు.
హైకోర్టు నిర్ణయమే కీలకం..
గత నెల రోజులకుపైగా ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. తమ డిమాండ్లు తీర్చే వరకు సమ్మె కొనసాగిస్తామంటూ స్పష్టం చేస్తున్నారు. అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఆర్టీసీ డిమాండ్లకు ఒప్పుకునేదే లేదని, సమ్మె చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకునేదే లేదని స్పష్టం చేశారు. నవంబర్ 5 గడువులోగా కార్మికులు విధుల్లో చేరాలని, లేదంటే వారితో ఆర్టీసీకి ఎలాంటి సంబంధం ఉండదని అన్నారు. అయితే, కార్మికులు మాత్రం సమ్మె కొనసాగించేందుకు మొగ్గు చూపారు. దీంతో బుధవారం నాటి హైకోర్టు నిర్ణయం కీలకంగా మారింది.