మోహన్ రెడ్డి వడ్డీ దందా: తుపాకితో బెదిరించి ఇల్లు ఖాళీ చేయించారట
కరీంనగర్: అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఎఎస్సై) మోహన్ రెడ్డి వడ్డీ వ్యాపారం వ్యవహారంలో అశ్చర్యకరమైన విషయాలు బయటపడుతున్నాయి. ఓ వ్యక్తిని తుపాకితో బెదిరించి, ఇల్లు ఖాళీ చేయించారనే విషయం తాజాగా వెలుగు చూసింది. ఈ విషయాన్ని మోహన్ రెడ్డి అనుచరుడు శ్రీధర్ రెడ్డి అంగీకరించినట్లు గురువారం మీడియాలో వార్తలు వచ్చాయి.
అక్రమ ఫైనాన్స్ దందాలో అరెస్టయిన ఏఎస్ఐ మోహన్రెడ్డి బినామీ, ప్రధాన అనుచరుడు పుర్మ శ్రీధర్రెడ్డిని సీఐడీ అధికారులు మంగళవారం సాయంత్రం జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ఫైనాన్స్ దందాలో ప్రధాన నిందితుడిగా ఉన్న శ్రీధర్రెడ్డిని అదుపులోకి తీసుకున్న సీఐడీ అధికారులు అతడిపై క్రైం నంబర్ 25/2015లో ఐపీసీ 386, 451,452,420, 506, రెడ్ విత్ 34 సెక్షన్లతో పాటు ఆయుధాలతో బెదిరించినట్లుగా కేసు నమోదు చేశారు.
సికింద్రాబాద్లోని అల్వాల్ ప్రాంతానికి చెందిన దొనపాటి వెంకటరమణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసుల్లో శ్రీధర్రెడ్డి నాలుగో నిందితుడిగా ఉన్నాడు. కరీంనగర్ శ్రీనగర్కాలనీలో వెంకటరమణారెడ్డికి చెందిన ఇల్లును రూ.13లక్షల కింద తనఖా పెట్టుకున్న మోహన్రెడ్డి తన పేరిట రిజిస్టర్ చేసుకుని మరొకరికి అమ్మినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
వడ్డీతో సహా రూ.26లక్షలు చెల్లించినా తన ఇల్లు ఇవ్వకుండా బెదిరించి ఖాళీ చేయించాడని వెంకటరమణారెడ్డి ఫిర్యాదు చేశాడు. దీంతో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మోహన్రెడ్డితో పాటు ఇట్టిరెడ్డి శ్రీపాల్రెడ్డి, కామారపు జ్ఞానేశ్వర్, పుర్మ శ్రీధర్రెడ్డి, కత్తి రమేశ్, హనుమాండ్ల సుమన్రెడ్డి, హనుమాండ్ల జనార్దన్రెడ్డిని నిందితులుగా పేర్కొన్నారు.
కేసులో ఏ1 నిందితుడు మోహన్రెడ్డి ఇప్పటికే జైలులో ఉండగా, ఏ4 శ్రీధర్రెడ్డిని మంగళవారం సాయంత్రం న్యాయస్థానంలో హాజరుపరిచారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు వెల్లడించిన అధికారులు, నిందితుడి వాంగ్మూలాన్ని కూడా కోర్టులో దాఖలు చేశారు. దీనిపై కరీంనగర్ అదనపు జ్యుడీషియల్ న్యాయమూర్తి అజహర్ హుస్సేన్ డిసెంబర్ 1 దాకా శ్రీధర్రెడ్డికి రిమాండ్ విధించారు. దీంతో సీఐడీ అధికారులు శ్రీధర్రెడ్డిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. నిందితుడిని ఇంకా విచారించాల్సి ఉందని రిమాండ్ షీట్లో పేర్కొన్న అధికారులు విచారణ కోసం కస్టడీ కోరే అవకాశం ఉందని అంటున్నారు.
వెంకటరమణారెడ్డితో బలవంతంగా ఖాళీ చేయించి ఆ ఇంటిని మరొకరికి అమ్మామనీ, మోహన్రెడ్డితో పాటు శ్రీపాల్రెడ్డి, జ్ఞానేశ్వర్, రమేశ్, సుమన్, జనార్దన్రెడ్డి కలిసి అతడి ఇంటికి వెళ్లి తలకు తుపాకీ పెట్టి బెదిరించామనీ, బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించి స్వాధీనం చేసుకున్నది వాస్తవమేనని సీఐడీ అధికారుల ఎదుట శ్రీధర్రెడ్డి అంగీకరించినట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత ఆ ఇంటిని మహ్మద్ షఫీయొద్దీన్ అనే వ్యక్తికి అమ్మినట్లు తెలిపాడు. అప్పు తీసుకున్నవారి ఇంటికి వెళ్లి వడ్డీ డబ్బు కోసం బెదిరించే వారమనీ, మోహన్రెడ్డి స్వయంగా వచ్చి తన తుపాకీతో బెదిరించేవాడని వాంగ్మూలమిచ్చాడు. వెంకటరమణారెడ్డి తనకు జరిగిన అన్యాయంపై 2014 మార్చిలో కరీంనగర్ వన్టౌన్లో ఫిర్యాదు చేశారు.
అప్పటి ఇన్స్పెక్టర్, మోహన్రెడ్డికి సమాచారం ఇచ్చాడనీ, తర్వాతి రోజే తమంతా కలిసి వెంకటరమణారెడ్డి ఇంటికి వెళ్లి బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించామని చెప్పాడు. మోహన్రెడ్డి ఫైనాన్స్ దందాకు సీఐడీ కానిస్టేబుల్ పర్శరాం, వన్టౌన్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, శంకర్సింగ్, హోంగార్డ్ శ్రీనివాస్గౌడ్ సహకరించేవారని వెల్లడించాడు.