గోల్కొండ పరిసరాల్లో వింత జంతువు: హైదరాబాద్ నడిరోడ్డు మీద చిరుత: గాయాలతో కదల్లేని స్థితిలో
హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అమలు చేస్తోన్న లాక్డౌన్ ప్రభావం వల్ల జనసంచారం స్తంభించిపోయింది. వాహనాల వాహనాల రణగొణ ధ్వనులు లేవు. ఫలితంగా- అడవి జంతువులు రోడ్ల మీదికొస్తున్నాయి. స్వేచ్ఛగా తిరుగాడేస్తున్నాయి. దట్టమైన అడవులతో నిండివున్న తిరుమల, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాల్లో అడవి జంతువులు రోడ్ల మీద సంచరించడాన్ని సహజంగానే తీసుకున్నప్పటికీ.. హైదరాబాద్ వంటి మహా నగరాల్లో నడి రోడ్ల మీద తిరుగాడటం ఆశ్చర్యం కలిగించేదే. అరుదైన వన్యప్రాణులు హైదరాబాద్ పరిసరాల్లో దర్శనం ఇస్తున్నాయి.
Recommended Video
రోడ్డు ప్రమాదాల్లో రాలిపోతున్న వలస కార్మికులు: 14 మంది దుర్మరణం
మైలార్దేవ్పల్లి జాతీయ రహదారిపై..
హైదరాబాద్ నగర శివార్లలో బెంగళూరు జాతీయ రహదారి మీద మైలార్దేవుపల్లి అండర్పాస్ వద్ద చిరుత కనిపించింది. గాయాల వల్ల కదల్లేని స్థితిలో చిరుతను చూసిన వాహనదారులు ఉలిక్కిపడ్డారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారాన్ని ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది ట్రాంక్విలైజర్ ద్వారా మత్తులోకి పంపారు. దాన్ని స్వాధీనం చేసుకుని, నెహ్రూ జూపార్కునకు తరలించారు. గుర్తు తెలియని వాహనం ఢీ కొనడం వల్ల చిరుత గాయపడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
గోల్కొండ పరిసరాల్లో వింత జంతువు..
గోల్కొండ పరిసర ప్రాంతాల్లో వింత జంతువు స్థానికులను హడలెత్తించింది. చూడ్డానికి పిల్లి కంటే కాస్త బలంగా నల్లటి శరీరంతో కనిపించిన ఆ జంతువు గోల్కొండ సమీపంలోని నూరానీ మసీదు పరిసర ప్రాంతంలో చక్కర్లు కొట్టింది. దీన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు అటవీశాఖ సిబ్బంది సహకారంతో ఆ జంతువును బంధించారు. నెహ్రూ జులాజికల్ పార్కునకు తరలించారు. అరుదైన జాతికి చెందిన ఆసియన్ పామ్ సివెట్ (Asian palm Civet) జాతికి చెందిన పిల్లిగా నిర్ధారించారు.
ఇదివరకు తిరుమలలో..
ఇదివరకు తిరుమల పుణ్యక్షేత్రంలో అటవీ జంతువులు స్వేచ్ఛగా తిరుగాడని సందర్భాలు చాలా ఉన్నాయి. లాక్డౌన్ వల్ల తిరుమల శ్రీవారిని దర్శించడానికి వచ్చే లక్షలాది మంది భక్తుల రాకపోకలపై నిషేధం విధించారు. లాక్డౌన్ అమల్లోకి వచ్చినప్పటి నుంచీ తిరుమల గిరులు వన్యప్రాణుల సంచారం సందడిగా మారాయి. తిరుమల ఘాట్ రోడ్లపై తరచుగా చిరుతలు, జింకలు, దుప్పులు, ఎలుగుబంట్లు తిరుగాడుతూ కనిపించాయి. స్వామి వారి ఆలయ పరిసరాల్లో అడవి పందులు సంచరించాయి. దట్టమైన శేషాచలం అండవుల్లో జనసంద్రానికి దూరంగా సంచరించే అడవి జంతువులు స్వామివారి ఆలయ పరిసరాల్లో తిరుగాడాయి.