ఆసిఫాబాద్ జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా కోవా లక్ష్మీ : 32 జెడ్పీలు గెలుస్తామని గులాబీ దళపతి ధీమా
హైదరాబాద్ : ఆసిఫాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థిగా కోవా లక్ష్మీ పేరును టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. రాష్ట్రంలోని 32 జెడ్పీల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తంచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహంపై సోమవారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
త్వరలో 31 మంది అభ్యర్థుల పేర్లు
టీఆర్ఎస్ విసృతస్థాయి సమావేశంలో తొలుత కోవా లక్ష్మీ పేరును ఖరారు చేశారు. మిగతా 31 మంది అభ్యర్థులను త్వరలోనే ఖరారు చేస్తామని స్పష్టంచేశారు కేసీఆర్. 32 జెడ్పీలతోపాటు 530 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకునేందుకు కష్టపడి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల ఎంపిక, కార్యవర్గం ఏర్పాటు చేసేంత వరకు నేతలంతా సమన్వయంతో కలిసి ముందుకెళ్లాలని పేర్కొన్నారు.
విజయమే లక్ష్యంగా ...
స్థానిక ఎన్నికల్లో పార్టీ శ్రేణులు క్రియాశీలకంగా వ్యవహరించి..గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలన్నారు కేసీఆర్. అన్ని జడ్పీ స్థానాల్లో గులాబీ జెండా ఎగిరే విధంగా వ్యూహాత్మంగా ముందుకెళ్లాలని .. అందుకోస పక్కా ప్రణాళితతో అడుగులు వేద్దామని స్పష్టంచేశారు.
రెవెన్యూ వ్యవస్థ రద్దుపై చర్చ
స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు రెవెన్యూ, మున్సిపల్ చట్టాలపై సీఎం చర్చించినట్టు తెలుస్తోంది. రెవెన్యూ వ్యవస్థను రద్దుచేస్తే ఎలా ఉంటుందనే అంశంపై సీనియర్ నేతల అభిప్రాయం తీసుకున్నారు. రెవెన్యూ వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయని, వాటి స్థానంలో కొత్త చట్టం తీసుకురావడం మంచిదనివారు చెప్పినట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు కేసీఆర్ స్పష్టంచేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది.