అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం.. ఏర్పాట్లు పూర్తి.. అక్రమ ఆయుధాలు, కోట్ల రూపాయలు సీజ్
హైదరాబాద్ : మహారాష్ట్ర, హర్యానా సాధారణ అసెంబ్లీ ఎన్నికల సమయం వచ్చేసింది. గెలుపోటములపై ప్రధాన పార్టీలు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అదలావుంటే 17 రాష్ట్రాలకు సంబంధించి 51 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి 24వ తేదీ ఫలితాలు వెలువడనున్నాయి. అయితే మహారాష్ట్రలో ఎన్నికల సందర్భంగా 142 కోట్ల నగదు పట్టుబడటం చర్చానీయాంశమైంది. ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటంతో ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంటుందనే ప్రచారం జరిగింది. మరోవైపు ఎన్నడూ లేని విధంగా 975 అక్రమ ఆయుధాలు పట్టుబడటం గమనార్హం. ఇక ఎగ్జిట్ పోల్స్పై కూడా కేంద్ర ఎన్నికల సంఘం షరతులు విధించింది.
గోదావరిలో లాంచీ వెలికితీత కోసం చివరి ప్రయత్నం: స్కూబా డైవర్లతో
అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం
మహారాష్ట్ర, హర్యానా సాధారణ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామానికి సమయం ఆసన్నమైంది. 21వ తేదీ సోమవారం నాడు ఎన్నికలు జరగనున్నాయి. ఆ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు 17 రాష్ట్రాల్లో 51 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. అందులో తెలంగాణలోని హుజుర్ నగర్ కూడా ఉప ఎన్నికల బరికి సిద్ధమైంది. గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, అస్సాం, కేరళ, మేఘాలయ, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో కూడా కొన్ని అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.
142 కోట్ల నగదు.. అక్రమ ఆయుధాలు సీజ్
మహారాష్ట్ర అసెంబ్లీ సమరంలో భాగంగా ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హీటెక్కించాయి. 19వ తేదీ శనివారం నాటితో ప్రచార గడువు ముగియడంతో ఇక ఎన్నికల తంతు మాత్రమే మిగిలి ఉంది. ఓటర్ల నాడి నిక్షిప్తమయ్యే ఈవీఎంలు బరిలో నిలిచిన అభ్యర్థుల భవిష్యత్తు తేల్చనున్నాయి. అదలావుంటే ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 142 కోట్ల రూపాయల నగదు పట్టుబడింది. మరోవైపు పెద్ద ఎత్తున అక్రమ ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. దాదాపు 975 అక్రమ ఆయుధాలను సీజ్ చేసినట్లు అదనపు ఎన్నికల ప్రధానాధికారి దిలీప్ మీడియాకు వెల్లడించారు.
బీజేపీ, కాంగ్రెస్ టఫ్ ఫైట్.. 24వ తేదీ ఫలితాలు..?
21వ తేదీ పోలింగ్ జరగనుండగా ఈ నెల 24వ తేదీ ఫలితాలు రానున్నాయి. జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్న మహారాష్ట్ర, హర్యానాలో బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. అదే క్రమంలో మరోసారి అధికార పీఠం దక్కించుకోవడానికి బీజేపీ శ్రేణులు శ్రమిస్తున్నాయి. మరోవైపు ఎలాగైనా ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కాలని కాంగ్రెస్ నేతలు కలలుగంటున్నారు. ఈసారి జరగనున్న ఎన్నికల్లో అధికార పీఠం ఎవరిదనే విషయంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చివరకు ఓటర్ల నాడి ఎలా ఉంటుందనేది చర్చానీయాంశంగా మారింది.
ఎగ్జిట్ పోల్స్పై సీఈసీ కొరడా
ఈ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెల్లడించే అంశంపై కొరడా ఝలిపించింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎన్నికలు జరగనున్న 21వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్పై నిషేధం విధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల వెనుక రాజకీయ జోక్యం ఉంటుందనే వాదనలు లేకపోలేదు. ఇక కొన్ని సంస్థలేమో ఆయా పార్టీలకు కొమ్ము కాస్తూ ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తాయనే వాదనలకు కూడా కొదువ లేదు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఈసీ అధికారులు తీసుకున్న నిర్ణయం హాట్ టాపికైంది.