భూముల ఆక్రమణలు: పొన్నాలపై క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం!
దళితులకు చెందిన అసైన్డు భూమిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు చెందిన తిరుమల హేచరీస్ నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించినట్లుగా నిరూపించే పక్కా రికార్డులు అధికారుల వద్ద.
హైదరాబాద్: దళితులకు చెందిన అసైన్డు భూమిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు చెందిన తిరుమల హేచరీస్ నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించినట్లుగా నిరూపించే పక్కా రికార్డులు అధికారుల వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. పొన్నాల లక్ష్మయ్య, ఆయన సోదరుడు పొన్నాల రామ్మోహన్రావుల అధీనంలో రెండు దశాబ్దాలకుపైగా ఉన్న ఎనిమిది ఎకరాల 39 గుంటల భూమిని సభాసంఘం ఫిబ్రవరి 27న క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది. దురాక్రమణ నిజమని తేలితే క్రిమినల్ చర్యలు తీసుకునే అకాశం ఉన్నట్లు తెలిసింది. కాగా, ఈ మేరకు నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రికలో ఓ కథనం వెలువడింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమయ్యింది.
సదరు పత్రిక కథనం ప్రకారం.. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. పాత వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం రాంపూర్ గ్రామం పరిధిలోని 339/2, 337 సర్వే నంబర్లలోని భూమిని 1982లో స్థానిక దళితులకు ప్రభుత్వం కేటాయించింది. ఇందులోనుంచి నాలుగు ఎకరాల ఏడుగుంటల భూమిని నిబంధనలకు విరుద్ధంగా తిరుమల హేచరీస్ సంస్థ కొనుగోలు చేసింది. దీనిని అప్పట్లోనే ప్రభుత్వం గుర్తించింది. సదరు భూమితోపాటు పక్కనే ఉన్న మరో 4.32 ఎకరాల భూమిని కూడా ఆక్రమించినట్టుగా వెలుగులోకి వచ్చింది.
ఇదే సమయంలో అక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని భావించిన ప్రభుత్వం స్థానికంగా ఉన్న 81 ఎకరాలకుపైగా భూమిని అప్పటి ఏపీ పరిశ్రమల మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ)కు అప్పజెప్పింది. క్షేత్రస్థాయిలో ఈ భూములను ఏపీఐఐసీ స్వాధీనం చేసుకుంటున్న సందర్భంలోనే 8.39 ఎకరాల భూములు పొన్నాల లక్ష్మయ్యకు చెందిన తిరుమల హేచరీస్ ఆధీనంలో ఉన్నాయని అధికారులు గుర్తించారు.
ఈ భూమిని పొన్నాల లక్ష్మయ్య, పొన్నాల రామ్మోహన్రావు అసైన్డుదారులైన పేదల నుంచి చట్టవిరుద్ధంగా కొనుగోలు చేశారని రెవెన్యూ అధికారులు సర్కారుకు తెలియజేసినట్లు సమాచారం. దీనిపై తిరుమల హేచరీస్ హైకోర్టుకు వెళ్ళడంతో.. ఆర్డీవో వద్ద తేల్చుకోవాలంటూ కోర్టు వెనక్కి పంపించింది. ఈ వ్యవహారంపై అప్పట్లో ప్రతిపక్షాలు పొన్నాల లక్ష్మయ్యను తీవ్రంగా విమర్శించాయి. టీడీపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు కూడా జరిగాయి.
వైయస్ హయాంలో...
వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత 2005 సెప్టెంబరు ఆరోతేదీన జరిగిన క్యాబినెట్ సమావేశంలో.. రాంపూర్ గ్రామ పరిధిలోని 81 ఎకరాలకుపైగా భూమిని ఏపీఐఐసీకి అప్పగించే ప్రతిపాదనలను ఆమోదించారు. అయితే, ఆ భూమిలో ఉన్న సుమారు 9 ఎకరాలు తిరుమల హేచరీస్ ఆధీనంలో ఉండటంతో వైయస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య పావులు కదిపారు. సదరు దాదాపు తొమ్మిది ఎకరాలను ఏపీఐఐసీకి అప్పగించినట్లుగా, అనంతరం తిరుమల హేచరీస్కు ఆ భూమిని ఏపీఐఐసీ కేటాయించేలా వ్యవహారాన్ని నడిపించారు.
కలెక్టర్కు అఫిడవిట్
వివాదాస్పద భూములపై విచారణ సందర్భంగా కలెక్టర్కు అప్పట్లో పొన్నాల అఫిడవిట్ అందజేశారు. తాము ఆ (అసైన్డు) భూములను కొనుగోలు చేశామని అందులో ఆయన పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పొజిషన్లో ఉన్నాం కాబట్టి.. ఆ భూములను తమకే ఇవ్వండి అంటూ కలెక్టర్కు పొన్నాల సూచించినట్లు సమాచారం. మంత్రి హోదాలో ఉండి బహిరంగంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, తమకే అసైన్డ్ భూములను కేటాయించాలంటూ దరఖాస్తు చేయడం పొన్నాలకే చెల్లిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు, అప్పట్లో ఎకరం భూమి రూ.10 లక్షల వరకు ఉంటే.. పొన్నాలకు రూ.25,500లకు ఎకరం చొప్పున ఇచ్చినట్టుగా రికార్డులు ఉన్నాయి. ఈ విధంగా నిరుపేదల భూమిని అతితక్కువ ధర చెల్లించి పొన్నాల సొంతం చేసుకున్నారు. ఈ కేటాయింపులపై సీసీఎల్ఎ కార్యాలయంలోనే నిర్ణయం తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. అయితే, ఈ నిర్ణయానికి సంబంధించిన రికార్డుల్లో సీసీఎల్ఎ సంతకాలు లేవు. అసిస్టెంట్ సెక్రెటరీ సంతకం మాత్రమే తీసుకున్నారు. ఈ వ్యవహారానికి చట్టబద్ధత కల్పించటం కోసం క్యాబినెట్ ద్వారా ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చారు (రాటిఫై చేశారు). ఏపీఐఐసీ ద్వారా అలాట్మెంట్ చేయించారు. ఇలా రికార్డులన్నీ చూస్తే.. పొన్నాల అక్రమంగా అధికారాన్ని ఉపయోగించుకుని, అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి, చట్టాన్ని తుంగలోతొక్కి అసైన్డ్ భూములను దక్కించుకున్నారనేది స్పష్టమవుతుంది.
27న సభా సంఘం విచారణ
అసైన్డు భూములకు సంబంధించి పొన్నాల లక్ష్మయ్య, తిరుమల హేచరీస్లపై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును సభా సంఘానికి అప్పగించింది. దీనిపై సభాసంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే సుధీర్రెడ్డి ఆధ్వర్యంలో విచారణ జరుగుతున్నది. ఇందులో భాగంగానే ఈ నెల 27న సభాసంఘం తిరుమల హేచరీస్ వద్దకు వెళ్ళనుంది. ధర్మసాగర్ మండలం రాంపూర్ గ్రామాన్ని సందర్శించనుంది. అసైన్డు భూములకు సంబంధించిన పూర్తి రికార్డులను పరిశీలించి, భూములతో సంబంధం ఉన్న వ్యక్తులను కలుసుకుని, వారి నుంచి సమాచారాన్ని సేకరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది.
క్రిమినల్ చర్యలకు అవకాశం
కాగా, నిబంధనలకు విరుద్ధంగా అసైన్డు భూములను కొనుగోలు చేయటం, అధికారయంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి బదలాయించుకోవటం వంటి అంశాలు రెవెన్యూ అధికారులు ఇచ్చిన నివేదికల్లో స్పష్టంగా ఉన్న నేపథ్యంలో ఈ అసైన్డు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నదని సమాచారం. ఈ భూముల వ్యవహారం తీవ్రతను బట్టి పొన్నాల లక్ష్మయ్య తదితరులపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.