ఆనంద్ రెడ్డి స్నేహితుడే హంతకుడు, వాటా డబ్బులు అడిగినందుకే ఘాతుకం, ప్రదీప్ రెడ్డి సహా ఆరుగురు కలిసి..
అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆనంద్ రెడ్డి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు దారితీశాయని వివరించారు. ప్రధాన నిందితుడు ప్రదీప్ రెడ్డి పరారీలో ఉన్నాడని, మొత్తం ఆరుగురు కలిసి ఆనంద్ రెడ్డిని హత్య చేశారని పోలీసులు పేర్కొన్నారు. నిందితులు అందరినీ త్వరలోనే పట్టుకొంటామని చెబుతున్నారు.
ఇదీ నేపథ్యం
జనగామ జిల్లా ఓబుల్ కేశవాపూర్కు చెందిన మోకు ఆనంద్ రెడ్డి (45).. ఖమ్మం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఇతనికి తల్లిదండ్రులు, తమ్ముడు, చెల్లి ఉన్నారు. పెళ్లి చేసుకోలేదు. వరంగల్ అర్బన్ జిల్లా శనిగరానికి చెందిన ప్రదీప్ రెడ్డితో స్నేహం ఏర్పడింది. గత నాలుగేళ్లుగా వీరిద్దరూ కలిసి వ్యాపారం చేస్తున్నారు. ఇసుక వ్యాపారంలో ఇద్దరు రూ.80 నుంచి రూ.90 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ఇసుక వ్యాపారంలో ఆనంద్ రెడ్డి తన వాటా కంటే అధికంగా డబ్బులు పెట్టారు, ఎక్కువ పెట్టిన నగదు ఇవ్వమని ప్రదీప్ రెడ్డిపై ఆనంద్ రెడ్డి ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో వీరి మధ్య వైరం ప్రారంభమైంది.
భూమి రాసిస్తానని చెప్పి..
డబ్బులు ఇస్తానని ప్రదీప్ రెడ్డి వాయిదా వేస్తూ వస్తున్నాడు. దీంతో ఈ నెల 7వ తేదీన హన్మకొండలోని హోటల్లో పెద్దల సమక్షంలో కూడా మాట్లాడుకున్నారు. నగదు సంబంధించి డబ్బులు, కొంత భూమి ఇస్తానని ప్రదీప్ వారితో చెప్పాడు. ఆ రోజు ఉదయం 9 గంలకు భూపాలపల్లికి ఆనంద్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి సహా మరికొందరు వెళ్లారు. అక్కడ పార్టీ చేసుకున్నాక.. భూమి, డబ్బుల గురించి డిస్కస్ చేద్దామని చెప్పి రాంపూర్ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడే ఆనంద్ రెడ్డి కళ్లకు గంతలు కట్టి, చేతులు వెనక్కికట్టేసి గొంతుకోసి చంపేశారు. తర్వాత హైదరాబాద్ వచ్చి.. కారును సర్వీసింగ్ చేయించారు. ప్రధాన నిందితుడు ప్రదీప్ రెడ్డి సహా నిందితులు పరారీలో ఉండగా.. ఒక నిందితుడు మాత్రం పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు తమదైనశైలిలో విచారిస్తే నేరాన్ని అంగీకరించాడు. ఆనంద్ రెడ్డిని గొంతుకోసి హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు.
ఇంటికి రాకపోవడంతో అనుమానం
7వ తేదీన ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. మరునాడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు చెప్పిన విషయాలను బట్టి పోలీసులు కూడా సస్పెక్ట్ చేశారు. నాలుగు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఆనంద్ రెడ్డి మొబైల్ సిగ్నల్ ఆధారంగా గాలించినా ఫలితం లేదు. దీంతో అనుమానితులపై ఫోకస్ చేసి.. విచారణ చేపట్టారు. ప్రధాన నిందితుడు ప్రదీప్ రెడ్డి సహా మిగతావారు పరారీలో ఉండగా.. ఒక నిందితుడు పట్టుబడ్డారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో హన్మకొండ ఏసీపీ జితేందర్ రెడ్డి సిబ్బందితో కలిసి నిందితుడిని ఘటనాస్థలానికి తీసుకెళ్లారు. గంటపాటు వెతికిన మృతదేహాం లభించలేదు.. కానీ దుర్వాసన వచ్చింది. దీంతో మరునాడు ఉదయం ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు.
Recommended Video
నమ్మించి మోసం
నగదు, భూమి రాసిస్తానని చెప్పిన స్నేహితుడు ప్రదీప్ రెడ్డి.. ఆనంద్ రెడ్డిని మట్టుబెట్టాడు. అటవీప్రాంతంలోకి వెళ్లాక.. ఆనంద్ కళ్లకు గంతలు కట్టి, చేతులు వెనక్కి కట్టేసి తీవ్రంగా దాడిచేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య చేసిన తర్వాత నిందితులు హైదరాబాద్ వెళ్లి.. కారును సర్వీసింగ్ చేసినట్టు వెల్లడించారు. ఆనంద్ రెడ్డి హత్యలో ప్రదీప్ రెడ్డి సహా మరో ఆరుగురు పాల్గొన్నట్టు తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.