మండిపోతున్న ఎండలు: తెలంగాణలొ అత్యధికంగా 44.4డిగ్రీల ఉష్ణోగ్రత
హైదరాబాద్: తెలంగాణలో భానుడి భగభగలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. మేడిపల్లిలో అత్యధికంగా 44.4డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గతంతో పోలిస్తే హైదరాబాద్లో సైతం ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వచ్చే మూడు రోజుల్లో నగరంలో ఉష్ణోగ్రతలు మరింత పెరగవచ్చునని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
గతంలొ ఏప్రిల్ నెలలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవలేదంటున్నారు. 45ఏళ్ల క్రితం 1973, ఏప్రిల్ 30న నమోదైన 43.3డిగ్రీల ఉష్ణోగ్రతనే ఇప్పటిదాకా హైదరాబాద్ లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత. కానీ ఇప్పుడా రికార్డుకు చేరువగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో.. ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
నగరంలోని పలుచోట్ల 42డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు తాజాగా వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇటీవలి కాలంలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత అంటున్నారు. కాగా, ఎండ కారణంగా ప్రజలు కూడా మధ్యాహ్నాం పూట రోడ్ల మీదకు రావడానికి భయపడుతున్నారు. గాలిలో తేమ శాతం తగ్గిపోవడంతో నగరంలో ఉక్కపోత కూడా ఎక్కువైంది.