కనీసం పార్కుల్లో కూడా కానరాని హరితహారం..! పచ్చదనం కరువైన నగర పార్కులు..!!
బంజారాహిల్స్ : హరితహారం పేరుతో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఖాళీ స్థలాలు, రోడ్లకు ఇరువైపులా.. ఇలా ఎక్కడ పడితే అక్కడ మొక్కలు నాటుతున్నారు. వీటిలో కొన్ని సంరక్షించే వారు లేక ఎండిపోతుంటే.. మరికొన్ని మేకలు, పశువులకు ఆహారంగా మారుతున్నాయి. పచ్చదనం అభివృద్ధి చేసేందుకు పార్కులు అందుబాటులో ఉన్నా.. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. అందుబాటులో ఉన్న పార్కులన్నింటినీ సంరక్షించుకోవాలని కేటీఆర్ ఆదేశించినా.. అధికారులు మొద్దు నిద్రను వీడటం లేదు. ఫలితంగా అహ్లాదం పంచాల్సిన పార్కులు.. బోసిపోయి దర్శనమిస్తున్నాయి.
హరితహారం పథకం కింద లక్షల మొక్కలు..! ఎటు పోయినట్టు..!!
విశాలమైన పార్కులో అందమైన మొక్కల స్థానంలో పిచ్చి చెట్లు దర్శనమిస్తున్నాయి. పెద్ద చెట్లు నీరు అందక వంట చెరుకుగా మారాయి. వాకర్స్ ట్రాక్ పెచ్చులూడిపోయి అధ్వానంగా ఉంది. దీంతో కొద్ది రోజులుగా వాకర్లు రావడం మానేశారు. ప్రధాన రోడ్డుకు ఆనుకుని ఉన్న ఈ పార్కును బాగుచేయాలని స్థానిక కాలనీ వాసులు పలుమార్లు అధికారులు, ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. కానీ ఎవరూ ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ప్రధాన గేటు కూడా విరిగిపోయింది. పార్కును అభివృద్ధి చేసి అందుబాటులోకి తేవాలని కాలనీవాసులు కోరుతున్నారు.
పార్కుల్లో పచ్చదనం కరువు..! అదికారుల దగ్గర సమాధానం కూడా కరువే..!!
జూబ్లీహిల్స్లో అనేక పార్కులు పచ్చదనానికి దూరంగా ఉన్నాయి. సొసైటీ ఏర్పాటు చేసే సమయంలో ప్రతి ఇరవై నివాసాలకు ఓ పార్కు ఉండేలా చర్యలు తీసుకున్నారు. దీనికి తగ్గట్టుగా జీహెచ్ఎంసీ ప్రహరీ కూడా నిర్మించింది. కానీ అందులో పచ్చదనం అభివృద్ధి చేయడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మొక్కలు నాటి, అవి పెరిగేంత వరకు సిబ్బందిని నియమించాల్సి ఉన్నా చర్యలు తీసుకోవడం లేదు. దీనికి తోడు నీటి సమస్యతో పార్కుల నిర్వాహణ జీహెచ్ఎంసీకి భారంగా తయారైంది. ఫిలింనగర్ చిల్డ్రన్స్ పార్కులో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ పిల్లల కోసం పార్కును అభివృద్ధి చేశారు. అయితే కాపలాదారులు లేకపోవడంతో నీటి మోటార్లు చోరీకి గురవడంతో పాటూ రాత్రిళ్లు అసాంఘిక శక్తుల అడ్డాగా మారింది.
గ్రీన్ బెల్టుకు కేటాయించిన స్థలంలో గుడిసెలు..! అందరూ కేసీఆర్,కేటీఆర్ తెలుసు అనే వాళ్లే..!!
బంజారాహిల్స్ రోడ్డు నంబర్-12 సయ్యద్నగర్లో గ్రీన్ బెల్టు అభివృద్ధి కోసం దాదాపు ఎకరానికి పైగా స్థలాన్ని కేటాయించారు. దీన్ని నిర్వహణ బాధ్యత జీహెచ్ఎంసీకి అప్పగించారు. మరోవైపు ఈ స్థలం కబ్జా చేసేందుకు కొంత మంది తెరవెనుక పావులు కదుపుతున్నారు. ఖాళీగా ఉన్న స్థలంలో కొంత మంది గుడిసెలు వేసుకోగా.. రెవెన్యూ అధికారులు తొలగించారు. ఈ సమయంలో స్థానికులు కొంత మంది దాడులకు తెగబడుతున్నారని అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎండుతున్న మొక్కలు, చెట్లు..! ఆక్రమణకు గురవుతున్న స్థలాలు..!!
స్థలం కబ్జా కాకుండా ఉండేలా డబుల్ బెడ్ రూంల నిర్మాణం చేపట్టాలని కార్పొరేటర్ విజయలక్ష్మి ప్రతిపాదనలు చేశారు. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే వరకూ స్థలాన్ని కాపాడాల్సిన బాధ్యత జీహెచ్ఎంసీ అధికారులదే. సంగాడి కుంట బస్తీలో మరో పార్కు కూడా కబ్జా అయ్యే స్థితిలో ఉంది. నాలుగు వందల గజాల పార్కును లే అవుట్లో చూపించిన అధికారులు.. దానికి గేటు పెట్టడం మరిచిపోయారు. ఫలితంగా పార్కు చుట్టు నిర్మాణాలు వెలిశాయి. ఇప్పుడు పార్కులోకి వెళ్లేందుకు దారి కూడా లేదు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.