"అసెంబ్లీపై దాడి చేశా, ఎమ్మెల్యేలు మూలన దాక్కున్నారు"
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనసభ్యుడు, బిసి సంక్షేమ సంఘం అద్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. పాతికేళ్ల వయస్సులో తాను అసెంబ్లీపై దాడి చేసినట్లు ఆయన చెప్పుకున్నారు.
బీసీలకు హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలకోసం తాను పాతికేళ్ల వయసులో రెండు వేల మంది విద్యార్థులతో అసెంబ్లీపై దాడి చేశానని ఆయన చెప్పారు. దాడి సమయంలో సభలో ఎమ్మెల్యేలంతా ఓ మూలన దాక్కున్నారని తెలిపారు.
ఆ దాడివల్లనే అది జరిగింది..
తాను చేసిన దాడివల్లే బీసీ విద్యార్థులకు ప్రభుత్వం హాస్టళ్లను పెంచి, రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసిందని కృష్ణయ్య చెప్పారు. దేశోద్ధారక భవన్లో ఆదివారం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ బీసీ సంక్షేమ సంఘం సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
బీసీ కమిషన్కు చట్టబద్దత
ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే జాతీయ బీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పించాలని ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ప్రభుత్వరంగ సంస్థల చైర్మన్లలో బీసీలను నియమించాలని డిమాండ్ చేశారు.
వారంతా పాల్గొన్నారు..
ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షుడుగుజ్జ కృష్ణ, రాష్ట్ర కార్యదర్శి నంద గోపాల్, గ్రేటర్ అధ్యక్షుడు భూపేశ్ సాగర్, కళామండలి అధ్యక్షులు రామలింగం, కోట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.ఈనెల 8న విజయవాడలో బీసీ విద్యుత్ ఉద్యోగుల మహాసభ నిర్వహిస్తున్నట్లు ఆర్.కృష్ణయ్య తెలిపారు.
కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో పాల్గొంటున్నందుకు..
కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో పాల్గొంటున్నందుకు రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు పోలంకి శ్రీనివాసరావును సంఘం నుంచి తొలగిస్తున్నట్లు కృష్ణయ్య ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం తాత్కాలిక కమిటీని ఆయన నియమించారు. అధ్యక్షుడిగా వీరభద్రయ్య, ప్రధాన కార్యదర్శిగా గణేశ్, ఎస్వీడీసీఎల్ నుంచి అధ్యక్షుడిగా జి.నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా ఎం.శ్రీధర్, ట్రాన్స్కో నుంచి అధ్యక్షుడు జి.రాంబాబు, కార్యదర్శిగా సుబ్బారావు ఎంపికయ్యారు.