లైట్ తీసుకున్నందుకు భారీ మూల్యం.. 22 మందికి కరోనా పాజిటివ్.. అక్కడినుంచే వ్యాప్తి..?
మొదట్లో ఒకటీ,రెండు కరోనా వైరస్ కేసులు నమోదైతేనే భయపడ్డ జనం.. ఇప్పుడు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. కేసుల సంఖ్య లక్ష దాటినా జనాల్లో అంత సీరియస్నెస్ కనిపించట్లేదు. మొదట్లో లాక్ డౌన్ ఆంక్షలను పక్కాగా పాటిస్తూ ఇళ్లకే పరిమితమైనవాళ్లు.. కేంద్రం ఆంక్షలను సడలించినప్పటి నుంచి కరోనాను లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. చాలాచోట్ల లాక్ డౌన్ ఆంక్షలను ఉల్లంఘిస్తున్న పరిస్థితి. తాజాగా తెలంగాణలో ఓ ఇంట్లో జరిగిన పార్టీకి హాజరైనవారిలో 22మందికి కరోనా పాజిటివ్గా తేలింది.
4 నెలల బాలుడికి కరోనా వైరస్, ఉలిక్కపడ్డ కాలనీ, రాకపోకలు బంద్...
ప్రతీ ఏడాది లాగే ఈసారి కూడా..
హైదరాబాద్ శివారులోని పహాడీ షరీఫ్లో ఇటీవల ఓ మటన్ వ్యాపారి ఇంట్లో బంధువులంతా కలిసి పార్టీ చేసుకున్నారు. సాధారణంగా ప్రతీ వేసవిలో కుటుంబ సభ్యులు,బంధువులు ఒకచోట చేరి వేడుకలు చేసుకునేవారు. ఈసారి కరోనా కారణంగా కొంత తటపటాయించినప్పటికీ.. చివరి అందరూ కలుసుకోవడానికే మొగ్గుచూపారు. అలా కొద్దిరోజుల క్రితం ఆ మటన్ వ్యాపారి ఇంటికి బంధువులంతా వచ్చారు. అంతా కలిసి 42 మంది వరకు ఉండవచ్చునని తెలుస్తోంది. ఇందులో హైదరాబాద్లోని బోరబండ,సంతోష్ నగర్,జియా గూడా,గౌలిపురా నుంచి వచ్చినవారు కూడా ఉన్నారు.రెండు రోజుల పాటు వీరంతా సరదాగా గడుపుతూ పార్టీ జరుపుకున్నారు.
అక్కడినుంచి మరో బంధువు ఇంటికి...
పహాడీ షరీఫ్లో పార్టీకి హాజరైనవారిలో 18 మంది.. ఆ తర్వాత మహేశ్వరం మండలం హర్షగూడలో ఉన్న మరో బంధువు ఇంటికి వెళ్లారు. సదరు బంధువు కిరాణ దుకాణం నిర్వహిస్తుంటాడు. అంతా కలిసి మరోసారి అక్కడ పార్టీ చేసుకున్నారు. మరుసటి రోజు ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. అయితే బోరబండ,సంతోష్ నగర్ ప్రాంతాల నుంచి పహాడీ షరీఫ్లో పార్టీకి వెళ్లినవారిలో 4 రోజుల క్రితం ఇద్దరికి కరోనా పాజిటివ్గా తేలడంతో అంతా ఉలిక్కిపడ్డారు.
మటన్ వ్యాపారికి సోకడంతో కలకలం..
వైద్య సిబ్బంది,అధికారులకు పహాడీ షరీఫ్ మటన్ వ్యాపారి ఇంట్లో పార్టీ గురించి తెలియడంతో.. అందరినీ హోమ్ క్వారెంటైన్లో ఉండాలని సూచించారు. సోమవారం(మే 25) వీరి శాంపిల్స్ను పరీక్షించగా 13 మందికి పాజిటివ్గా తేలింది. ఇందులో ఆ మటన్ వ్యాపారి కూడా ఉన్నాడు. అలాగే హర్షగూడ కిరాణ వ్యాపారి కుటుంబానికి కూడా టెస్టులు చేయగా నలుగురికి కరోనా నిర్దారణ అయింది. దీంతో మొత్తం 22 మందికి కరోనా అంటుకుంది.పహాడీషరీఫ్లో మటన్ వ్యాపారికి కరోనా పాజిటివ్గా తేలడంతో.. ఆరోగ్య సిబ్బంది ఆ ప్రాంతంలో సర్వే చేశారు. అతని నుంచి మాంసం కొనుగోలు చేసినవారి వివరాలు సేకరించారు. ప్రాథమిక కాంటాక్ట్ కింద 21 మందిని,సెకండరీ కాంటాక్ట్ కింద 47 మందిని గుర్తించి రావిర్యాల క్వారెంటైన్ కేంద్రానికి తరలించారు. మటన్ వ్యాపారి కాంటాక్టులపై ఇంకా ఆరా తీస్తున్నారు. హర్షగూడలో కిరాణ వ్యాపారి కుటుంబానికి కూడా కరోనా సోకడంతో.. అక్కడ కూడా వైద్య సిబ్బంది,ఆశా వర్కర్స్ ఇంటింటి సర్వే చేయనున్నారు. ఇప్పటికే ఆ కుటుంబం నివాసం ఉండే బస్తీలో 125 ఇళ్లను కంటైన్మెంట్ చేశారు.
Recommended Video
పెరుగుతున్న కేసులు
తెలంగాణలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది.గడిచిన 24 గంటల్లో కొత్తగా 71 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకూ మొత్తం కరోనా కేసుల సంఖ్య 1991కి చేరింది. కొత్త కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 38 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. . రంగారెడ్డి జిల్లాలో 7, మేడ్చల్ 6, సూర్యాపేట్, వికారాబాద్, నల్లగొండ, నారాయణపేట్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. ఇక 12 మంది వలస కార్మికులకు,ఇటీవల విదేశాల నుంచి వచ్చిన మరో నలుగురికి కూడా కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది.