భర్తను ఫాలో అయిన భార్య... సీక్రెట్ బట్టబయలు... రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని చితకబాదింది...
వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ భర్తను అతని భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. అనంతరం బంధువులతో కలిసి అతన్ని చితకబాదింది. తనను,పిల్లలను నిర్లక్ష్యం చేస్తూ మరో మహిళతో అతను వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే... కొత్తగూడెం పట్టణంలోని మేదర బస్తీలో రాజు అనే వ్యక్తి కేబుల్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. రాజుకు 13 ఏళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన కృష్ణవేణితో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఏడాది కాలంగా రాజు కొత్తగూడెంలోని గాజులరాజం బస్తీకి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
వ్యాపార నిమిత్తం డబ్బు అవసరం ఉందని చెప్పి ఇటీవల తన భార్య కృష్ణవేణి నగలన్నీ తీసుకెళ్లాడు. బ్యాంకులో కుదువపెట్టి లోన్ తీసుకుంటానని చెప్పిన రాజు... ఆ నగలను తనతో సంబంధం పెట్టుకున్న మహిళకు ఇచ్చాడు. కొద్దిరోజులుగా భర్త ప్రవర్తనలో మార్పును కృష్ణవేణి గమనించింది. గురువారం(మార్చి 4) ఉదయం అతను ఇంటి నుంచి బయటకు బయలుదేరగా... వెనకాలే అతన్ని ఫాలో చేసింది.
గాజులరాజం బస్తీలోని ఓ ఇంట్లోకి అతను వెళ్లడంతో... వెనకాలే ఆమె కూడా వెళ్లింది. అక్కడ మరో మహిళతో ఉన్న అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. వెంటనే బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు కూడా అక్కడికి చేరుకున్నారు. అంతా కలిసి అతన్ని చితకబాదారు. కృష్ణవేణితో గొడవల కారణంగా ఆమెకు విడాకులు ఇస్తున్నానని చెప్పి తనతో సంబంధం పెట్టుకున్నాడని సదరు మహిళ చెప్పింది. కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో... వారు రంగంలోకి దిగి రాజును అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.