అక్బరుద్దీన్పై దాడి: పహిల్వాన్ నిర్దోషి, ఆ నలుగురు దోషులకు 10 ఏళ్ల జైలు శిక్ష
మజ్లిస్ పార్టీ నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పైన దాడి కేసులో నాంపల్లి కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది.ఈ కేసులో కీలక నిందితుడు మహమ్మద్ పహిల్వాన్ సహా పదిమందికి న్యాయస్థానంలో ఊరట లభించింది.
హైదరాబాద్: మజ్లిస్ పార్టీ నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పైన దాడి కేసులో నాంపల్లి కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. ఈ కేసులో కీలక నిందితుడు మహమ్మద్ పహిల్వాన్ సహా పదిమందికి న్యాయస్థానంలో ఊరట లభించింది.
నాంపల్లి న్యాయస్థానం నలుగురిని దోషులుగా తేల్చింది. అక్బరుద్దీన్పై దాడి జరిగిన సమయంలో వీడియోలో కనిపించిన నలుగురికి కోర్టు శిక్షను విధించింది. నలుగురు దోషులకు పదేళ్ల జైలు శిక్ష విధించింది. 14 మంది నిందితుల్లో ఏ2, ఏ3, ఏ5, ఏ12లను కోర్టు దోషులుగా తేల్చింది. ఆ నలుగురు దోషులు.. సలీం బిన్, అబ్దుల్లా, అవద్, ఒమర్ యాఫై.
ఏం జరిగిందంటే...
2011 ఏప్రిల్ 30వ తేదీన చాంద్రాయణగుట్ట కేశవగిరిలోని బార్కస్ - బాలాపూర్ రోడ్డులో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పైన హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో అక్బరుద్దీన్కు తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఆయన గన్మెన్ జరిపిన కాల్పుల్లో ఇబ్రహీం అనే యువకుడు మృతి చెందాడు.
ఈ కేసులో 14 మంది నిందితులపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసులో నాంపల్లి కోర్టు చాలామంది సాక్షులను విచారించింది. అక్బరుద్దీన్ స్టేట్మెంట్ రికార్డు చేసింది. ఈ కేసు విచారణ ఆరేళ్ల పాటు సాగింది.