కాంగ్రెసు ఎమ్మెల్యేపై దాడి: బంద్, గువ్వలకు మందకృష్ణ సపోర్ట్
ఆదిలాబాద్/ హైదరాబాద్/ మహబూబ్నగర్: కాంగ్రెసు శాసనసభ్యుడు రామ్మోహన్రెడ్డిపై దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కుంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) శాసనసభ్యుడు గువ్వల బాలరాజుకు ఎమ్మార్పియస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ బాసటగా నిలిచారు. గువ్వల బాలరాజు దాడి చేయలేదని, ఆత్మగౌరవం కోసం ప్రతిఘటించారని ఆయన అన్నారు.
శనివారంనాడు ఆయన ఆదిలాబాదులో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే బాలరాజును అవమానించినవారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలన్నారు. దీనిపై అగ్రకుల పార్టీలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని మందకృష్ణ మాదిగ ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లా పరిషత్ సమావేశంలో గువ్వల బాలరాజు రామ్మోహన్ రెడ్డిపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
ప్రజాస్వామ్య వ్యవస్థలో శుక్రవారం చీకటిరోజని కల్వకుర్తి శాసనసభ్యులు వంశీచందర్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి పై దాడికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ శనివారం జిల్లా బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఎమ్మెల్యే వంశీచందర్రెడ్డి పార్టీ కార్యకర్తలతో కలిసి మహబూబ్నగర్లో బంద్లో పాల్గొన్న ఆయనని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రజాప్రతినిధిపై దాడి చేయడం అమానుషమని, టీఆర్ఎస్ ప్రభుత్వానికి పాలించే నైతిక హక్కు లేదని వంశీచందర్రెడ్డి విమర్శించారు. రామ్మోహన్ రెడ్డిపై గువ్వల బాలరాజు దాడి చేయడాన్ని నిరసిస్తూ శనివారం మహబూబ్నగర్ జిల్లా బంద్ జరిగింది. బంద్ ప్రశాంతంగా జరిగింది.
రౌడీల్లా టిఆర్ఎస్ నేతలు
కాగా, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్కు తమ పార్టీ వ్యతిరేకం కాదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రావుల చంద్రశేఖర్రెడ్డి చెప్పారు. శనివారం ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. కెసీఆర్ వ్యవసాయాన్ని వెంటిలేటర్పైకి తెచ్చారని విమర్శించారు. టీఆర్ఎస్ నేతలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ నాయకులు రౌడీయిజంలో బీహార్ను మించి పోయారని ఆయన ధ్వజమెత్తారు.
తెలంగాణలో నియంత పాలన
తెలంగాణలో నియంత పాలన సాగుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మహబూబ్నగర్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిపై చేయిచేసుకున్న ఘటనతో రౌడీల పాలనకు తెరదీశారన్నారు. అలాగే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని, రైతులకు రుణమాఫీ అమలు జరగడం లేదన్నారు. బ్యాంకర్లు వడ్డీలు వసూలు చేస్తూనే ఉన్నారని, వ్యవసాయశాఖా మంత్రి పంచె కట్టినంత మాత్రాన రైతు కాలేరని జీవన్రెడ్డి వ్యాఖ్యానించారు.